ఏపీ అసెంబ్లీ ఈ రోజు రసాభాషగా జరిగింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు వేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయిలో జరిగింది.
ముఖ్యంగా ఏపి మంత్రి ఆచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళం సృష్టించాయి. జగన్ హరీష్ రావుని ఒక హోటల్లో కలిసి, కేసిఆర్ కు లేఖ ఇచ్చి తమ నేతను ఓటుకు నోటు కేసులో ఇరికించారన్నారు. ఈ వ్యాఖ్యలను జగన్ తన దైన శైలిలో తిప్పికొట్టారు. నేను కేసిఆర్కు లేఖ ఇచ్చినట్లుగా, హరీష్ రావును ఏదో హోటల్లో కలిసినట్టుగా నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్దం, మరి అలా నిరూపించకపోతే మీ నాయకుడు చంద్రబాబు రాజీనామాకు సిద్దమా? సవాల్..! “ఛాలెంజ్” అని తీవ్రంగా స్పందించారు.
తనకు స్టీఫెన్సన్ ఎవరో తెలీదని, ఆయనకు ఎమ్మెల్సీ ఇప్పించాల్సిన ఖర్మ నాకు లేదని జగన్ పేర్కొన్నారు. ఇంకా నయం నేనే రేవంత్ రెడ్డిని డబ్బు కట్టలతో పంపించానని, ఫోన్లో మాట్లాడింది కూడా నేనె అని చెప్పలేదు.. అలా చెప్పనందుకు నిజంగా నాకు చాలా సంతోషకరంగా ఉందని జగన్ చెప్పుకొచ్చారు.
ఇంకా చంద్రబాబును ఉద్దేశించి, కేంద్రంతో ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా పోరాడాలని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రానికి డెడ్లైన్ ఇచ్చి, ఆ లోపు ప్రత్యేకహోదా ఇవ్వకపోతే మా మంత్రులు రాజీనామా చేస్తారని చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా అని జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
ఒకానొక దశలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలకు జగన్ సమాధానం ఇస్తుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు పోడియం దగ్గర గందరగోళం సృష్టించారు. అధికార పార్టీ సభ్యులు కూడా తీవ్రస్థాయీలో స్పందించడంతో ఒకానొక దశలో ఎమ్మెల్యేలు కొట్టుకొనేవరకు వెళ్ళినట్లు సమాచారం. ఇదే రకంగా కొనసాగితే రేపటి అసెంబ్లీ సెషన్స్లో కొట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు.