వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాదయాత్ర వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగతుందంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డిజిపి మాలకొండయ్యలకు ఫిర్యాదు అందింది. జి. భార్గవి పేరుతో మంగళవారం ఉదయం పై ఇద్దరికి మోస్ట్ అర్జంట్ అంటూ ఓ ఫిర్యాదు ఫ్యాక్స్ ద్వారా అందింది.
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో జగన్ పాదయాత్ర జరుగుతోంది. త్వరలో ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర ప్రవేశిస్తున్నందున శాంతి భద్రతలకు విఘాతం కలడంతోపాటు అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నట్లు ఫిర్యాదుదారు భార్గవి ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్ర వల్ల సిఐసి, ఐసిఎస్ పరీక్షలు వాయిదా పడినట్లు ఆరోపించారు. పాదయాత్ర వల్ల పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు సెక్యురిటీ ఇవ్వలేకపోతున్నట్లు ఉన్నతాధికారులు చెప్పిన విషయాన్ని ఫిర్యాదుదారు గుర్తు చేశారు.
పాదయాత్రలో అనంతపురంకు చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి మరణించటాన్ని ప్రస్తావించారు. పాదయాత్రలో పాల్గొంటూనే గుండెపోటుతో మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటి ఘటనలు మరో సారి జరగకూడదంటే తక్షణమే పాదయాత్ర అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.