రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్, స్పీకర్, ఏపీముఖ్య మంత్రి కంప్లీట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కలిసి వైఎస్ జగన్ ఫిర్యాదు చేయబోతున్నారని తెలిపారు.
రాష్ట్రపతి, ప్రధాని సహా అన్ని జాతీయ పార్టీల నాయకులను కలిసి ఫిర్యాదు చేస్తారని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించే చర్యల నిరోధానికి సమగ్ర చట్టం రూపొందించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు. ఫిరాయింపుదారులను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలోకి తీసుకుంటే గవర్నర్ రాజముద్ర చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వారితో మంత్రులుగా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించడం రాజ్యాంగ ధర్మానికి విరుద్ధమన్నారు. రాజ్యాంగాన్ని, చట్టంను పట్టించుకోవాల్సిన అవసరం లేదా అని ధర్మాన ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవహరించారని, రాజకీయ సంప్రదాయాలు, విలువలు పట్టించుకోకుండా టీడీపీ వ్యవహరిస్తోందని వాపోయారు. వ్యవస్థపై ప్రజలకు అసహ్యం కలిగేలా ఏపీ ప్రభుత్వం నడుచుకుంటోందని అన్నారు.