వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల మ్యానువల్, సాఫ్ట్వేర్లో ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించిన అంశాలు తొలగించే వరకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ దరఖాస్తులు ఆపాలని హైకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రేషన్ల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ వివరాలు అడగొద్దని స్పష్టం చేసింది. ధరణిలో ఆస్తుల నమోదుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు అడగబోమని అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చినప్పటికీ.. స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ దరఖాస్తుల పేరిట ఆ వివరాలు సేకరిస్తున్నారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఆధార్ వివరాల సేకరణపై వివరణ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. ఆధార్ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని అడగటం లేదని… అది ఐచ్ఛికమేనని సీఎస్ తెలిపారు. సీఎస్ వివరణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్ వివరాలు అడగబోమని స్పష్టమైన హామీ ఇచ్చి.. ఇప్పుడు స్వచ్ఛందంగా ఇస్తే నమోదు చేస్తున్నామనడం సమంజసం కాదని పేర్కొంది.