ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన బిల్లులకు గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజముద్ర వేశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం-2014 రద్దు బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపారు.
ఇకపై శాసన రాజధానిగా అమరావతి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది. రెండు బిల్లులకు జనవరిలో శాసన సభ ఆమోదం తెలిపింది.శాసనమండలిలో ఈ బిల్లులు మొదట పాస్ కాలేదు. ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. దీంతో, జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసి, ఆ తర్వాత, శాసన మండలికి పంపింది. అనంతరం నెల రోజుల తర్వాత బిల్లు ఆటోమేటిక్ గా పాస్ అయినట్టుగా భావించి, గవర్నర్ ఆమోదానికి పంపారు.
సెప్టెంబర్13, 2019న రిటైర్డు ఐఏఎస్ అధికారి జీఎన్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 20, 2019న పరిపాలన వికేంద్రీకరణకు ఈ కమిటీ సిపార్స్ చేసింది. దీంతో ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ కోసం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టారు. వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో ఏపీకి మూడు రాజధానులు ఏర్పడనున్నాయి.