హైదరాబాద్ : పేద, మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్తో బాధపడే వారికోసం రూ. 18 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో కార్పోరేట్ హాస్పిటల్స్ కు దీటుగా అంకాలజీ భవనాన్ని తీర్చిదిద్దింది. ఈ క్యాన్సర్ వార్డును రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మేఘా ఇంజినీరింగ్ సంస్థ చైర్మన్ పి.పి.రెడ్డి, డైరక్టర్ పి. సుధారెడ్డిలు హాజరైనారు. ప్రభుత్వ వైద్య సంస్థ అయిన నిమ్స్ కు సాధారణ, మధ్య తరగతి వర్గాల పేషెంట్లే ఎక్కువగా వస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధి అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావడంతో అలాంటి సేవలన్నీ ఇకపై నిమ్స్లో అతి తక్కువ ఖర్చుతోనే లభించనున్నాయి.
మేఘా సేవలు అభినందనీయం- మంత్రి ఈటెల
నిజాం కాలం నుంచి ఎంతో పేరు ప్రతిష్టలున్న నిమ్స్, దుర్గాబాయి్ దేశ్ముఖ్, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రుల్లో కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సబిలిటీ కింద మేఘా సంస్థ సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి ఈటెల ప్రశంసించారు. కాన్సర్ వార్డు ప్రారంభించిన తరువాత మంత్రి వివిధ వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సౌకర్యాలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం నిమ్స్ అభివృద్ధికి రూ.450 కోట్లతో ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 11న నిమ్స్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమక్షంలో సమీక్ష చేయనున్నట్లు మంత్రి చెప్పారు. వైద్య రంగంపై ఏటా 7500 కోట్లు ఖర్చుపెడుతున్నామని, రాష్ట్రంలోని ఆసుపత్రులను ఆధునీకరించి వైద్యరంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు.
ఆర్థోపెడిక్ విభాగాన్నీ ఆధునీకరిస్తాం- పి.పి.రెడ్డి
మేఘా ఇంజనీరింగ్ ఛైర్మన్ పిపి రెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యత లో మేఘా ఎప్పుడు ముందుంటుందని, కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా నిమ్స్ క్యాన్సర్ వార్డును నిర్మించామని తెలిపారు. అలాగే నిమ్స్ లోని ఆర్థోపెడిక్ విభాగాన్ని కూడా ఆధునీకరిస్తామని, దుర్గాబాయ్ దేశముఖ్ ఆసుపత్రి రూపురేఖలు మార్చుతామన్నారు.
క్యాన్సర్ రోగులకు వరం- డా. మనోహర్
నిమ్స్ డైరెక్టర్ మనోహర్మాట్లాడుతూ అడిగిన వెంటనే నిమ్స్ ఆసుపత్రికి భారీగా నిధులు కేటాయించి కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా అత్యాధునిక టెక్నాలజీని, కాన్సర్ వార్డును పునర్ నిర్మించిన మేఘా చైర్మన్ పి.పి.రెడ్డి, ఎండీ పి.వి.కృష్ణారెడ్డి, డైరెక్టర్ పి.సుధారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. బయట ఆస్పత్రుల్లో రూ.20 లక్షలు ఖర్చు అయ్యే వైద్య సేవలు, నిమ్స్ ఆస్పత్రిలో కేవలం లక్ష రూపాయల్లోనే అందుతాయని, ఇది ప్రజలకు ఎంతో ఊరటనిస్తుందన్నారు.
మేఘా నిర్మించిన క్యాన్సర్ వార్డు ప్రత్యేకతలివి
*రూ. 18 కోట్లతో ఆంకాలజీ బ్లాక్ ఆధునికీకరణ
*ఆంకాలజీ విభాగానికి కార్పొరేట్ హంగులు
*20 వేల చదరపు అడుగుల క్యాన్సర్ వార్డు
*మహిళలు, పురుషులు, చిన్నారులకు ప్రత్యేక వార్డులు
*ప్రతి బెడ్డుకు ఆక్సిజన్, వెంటిలేటర్స్, సెంట్రల్ ఏసీ
*రక్త క్యాన్సర్ బాధితులకు ప్రత్యేకంగా లుకేమియా వార్డు
*ఆంకాలజీ బ్లాకు మెయింటెనెన్సు ఖర్చును మూడేళ్ళ పాటు భరించనున్న మేఘా సంస్ధ
*50 పడకలతో క్యాన్సర్ పేషెంట్ ల చికిత్స కు ప్రత్యేక వార్దులు
*పీడియాట్రిక్ క్యాన్సర్,లుకేమియా బాధితుల చికిత్స కోసం అధునాతన వార్డులు
*పేషెంట్లకు అనుక్షణం వార్డుల్లో సేవలందించేందుకు డాక్డర్లకు, నర్సులకు ప్రత్యేక గదులు
*మహిళలు, పురుషులు, చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డులు
*కార్పోరేట్ సోషియల్ రెస్పాన్స్ బులిటి లో భాగంగా (CSR) NIMS లో MEIL సేవలు