హిమాచల్ ప్రవేశ్ సిర్మౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాలకు చెందిన బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో డ్రైవర్ సహా ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సంగ్రాహ్ పట్టణంలోని దేవ్ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుళ్తుండగా రేణుకజి ప్రాంతంలో బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు కూడా గాయపడ్డారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో మొత్తం 18 మంది విద్యార్థులు బస్సులో వున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో చిన్నారులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో కూడా కొంత మంది పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.
బాగా ఎత్తులోంచి పడటంతో బస్సు తుక్కుతుక్కు అయ్యిందని… అందులో ఇరుక్కున్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.