నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డను కిరాతకంగా కడతేర్చింది తల్లి. తల్లి అనే పదానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తలచి, అభం శుభం తెలియని మూడేళ్ల బా లుడిని గొంతు నులిమి చంపేసింది. తనకు ఏమి తెలియనట్లు వ్యవహరించింది. పోలీసులు తన స్టైల్లో విచారిస్తే అసలు నిజం ఒప్పుకుంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఈ నెల 1న చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమ్మతనానికే మాయని మచ్చలా మిగిలిన ఈ ఘటన వివరాల్లోకి వెల్తే…మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన దుర్గం శంకరయ్య, దుర్గ అలియాస్ దీపకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. శంకరయ్య గ్రామంలో పశువుల కాపరిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టి చనిపోయాక మూడేళ్ల క్రితం బాబు అంజన్న జన్మించాడు.
ఇదే సమయంలో మిట్టపల్లికి చెందిన మరో వ్యక్తితో దుర్గ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె భర్త శంకరయ్య ఉదయం పశువులను తోలుకొని వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. దీంతో దీప వివాహేతర సంబంధానికి అంజన్న ప్రధాన అడ్డంకిగా మారాడు. దీంతో కొడుకును అడ్డు తొలగించుకొనేందుకు ప్లాన్ వేసింది.
ఎప్పటిలాగే శంకరయ్య పశువులను తోలుకొని వెళ్లాడు. ఆయన తిరిగివచ్చేసరికి బాబును దుర్గ గొంతునులిమి చంపేసింది. ఏమీ తెలియనట్లు బాలుని మృతదేహాన్ని మంచంలో ఉంచి, పడుకున్న బాబు లేవడం లేదని ఏడుస్తూ, చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది.
శంకరయ్యకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శ్రీరాంపూర్ సీఐ నారాయణ నాయక్, ఎస్ఐ విజేందర్ చేరుకొని దుర్గను తమదైన శైలీలో విచారించగా తానే చంపినట్లు ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.