క్వాలిఫయర్-2 కు అర్హత సాధించాలంటే కచ్చితం గా గెలువాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ బోల్తాకొట్టింది. బుధవారం ఇక్కడ జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించింది. ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభంలో మెరుపులు మెరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ యువ హిట్టర్ రిషబ్ పంత్.. మళ్లీ కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో జూలు విదిల్చిచాడు. మ్యాచ్ చేజారిపోతుందన్న కీలక సమయంలో థంపీ వేసిన 18వ ఓవర్లో రిషభ్ పూనకం వచ్చిన వాడిలా చెలరేగిపోయాడు. 4,6,4,6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. రిషబ్ పంత్ (49: 21 బంతుల్లో 2×4, 5×6) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై గెలిచి క్వాలిఫయర్-2లో దూసుకెళ్లింది.
చివరి 18 బంతుల్లో 34 పరుగులు అవసరమగా.. బసిల్ థంపీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ భారీ షాట్లు ఆడిన పంత్ వరుసగా 4, 6, 4, 6 బాదేశాడు.అంత వరకు మ్యాచ్ తమదే అనుకున్న సన్రైజర్స్ కళ్లముందే మ్యాచ్ చేజారుతుండటంతో సన్రైజర్స్ హెడ్కోచ్ టామ్ మూడీ స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అదృష్టం కలసి వచ్చి అతి తక్కువ పాయింట్లతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లే ఆఫ్ చేరిన జట్టుగా గుర్తింపు పొందిన సన్రైజర్స్ తన ఆటతీరును నిలబెట్టుకోలేక పోయింది.లీగ్లో కొనసాగాలంటే కచ్చితంగా గెలవాల్సిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్లో హైదరాబాద్ విఫలమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ మార్టిన్ గప్తిల్ (36: 19 బంతుల్లో 1×4, 4×6), మనీశ్ పాండే (30: 36 బంతుల్లో 3×4) మినహా ఎవరూ తమ ఆటతీరును ప్రదర్శించకపోవడంతో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులే చేయగలిగింది. అనంతరం ఛేదనలో పృథ్వీ షా (56: 38 బంతుల్లో 6×4, 2×6), రిషబ్ పంత్ (49: 21 బంతుల్లో 2×4, 5×6) చెలరేగడంతో ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే 165/8తో ఛేదించేసింది.