ఐపీఎల్లో సరికొత్త శకం మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ జట్లు ఐపీఎల్ను శాసించాయి. అయితే ఇప్పుడు ఆ జట్లు ఆశీంచిన ప్రదర్శన కనబర్చడం లేదు. ఈ రెండు జట్ల స్థానాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) రీప్లేస్ చేసి సరికొత్త శకానికి నాంది పలికాయి.
ఇక ఇవాళ ధర్మశాలలో జరగనున్న క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. గుజరాత్ టైటాన్స్ లీగ్లోకి వచ్చిన మొదటి ఐదు సీజన్లలో నాలుగు సార్లు ప్లేఆఫ్స్ చేరింది. మూడు సార్లు టాప్ 2లో నిలిచింది. ఆర్సీబీ ప్రయాణం నిలకడగా సాగుతూ గత ఐదు సీజన్లలో నాలుగు సార్లు ప్లేఆఫ్స్ చేరి ఎట్టకేలకు 2025లో తన తొలి ఐపీఎల్ టైటిల్ కలని నిజం చేసుకుంది. ఛాంపియన్లుగా నిలిచిన తర్వాత ఈ సీజన్లో కూడా లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి ఇరు జట్లు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ..టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా ప్రతి ఓవర్ను గరిష్టంగా ఉపయోగించుకునేలా తమ బ్యాటింగ్ లైన్అప్ను రూపొందించుకుంది. ఓపెనర్గా విరాట్ కోహ్లీ పవర్ప్లేలో ఇన్నింగ్స్ను నడిపిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ వేగంగా పరుగులు రాబడుతున్నారు. ఈ సీజన్లో 10వ ఓవర్ తర్వాత పాటిదార్ 207.37 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఆఖరి ఓవర్లలో టిమ్ డేవిడ్ 223.28 స్ట్రైక్ రేట్తో లీగ్లోనే అత్యంత ప్రమాదకరమైన ఫినిషర్గా మారాడు. ఆర్సీబీలో ఆరుగురు బ్యాటర్లు 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో పరుగులు చేశారు.
గుజరాత్ టైటాన్స్ తమ టాప్ త్రీ బ్యాటర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. జట్టు మొత్తం ఇన్నింగ్స్లో 66 శాతానికి పైగా బంతులను టాప్ త్రీ బ్యాటర్లే ఎదుర్కొంటున్నారు. శుభ్మన్ గిల్ మినహా మరే బ్యాటర్ 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగి లేనప్పటికీ వికెట్లు పడకుండా ఇన్నింగ్స్ ఆడటమే వీరి ప్రధాన బలం. పవర్ప్లేలో అత్యంత తక్కువ వికెట్లు కోల్పోయిన జట్టుగా గుజరాత్ రికార్డు సృష్టించింది. టాప్ త్రీ బ్యాటర్లలో ఎవరో ఒకరు ఆఖరి వరకు క్రీజులో ఉంటూ జట్టుకు విజయాలు అందిస్తున్నారు.
పవర్ప్లే బౌలింగ్లో ఇరు జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాయి. గుజరాత్ జట్టులో మహమ్మద్ సిరాజ్, కాగిసో రబాడా బంతితో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. మొత్తంగా ధర్మశాల వేదికగా జరిగే క్వాలిఫైయర్ 1 కేవలం ప్లేఆఫ్ మ్యాచ్ మాత్రమే కాదు…క్రికెట్ లవర్స్కి పండగే. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఓడిన జట్టు క్వాలిఫైయర్ 2లో గెలిచిన జట్టుతో తలపడనుంది.
