జైలు శిక్ష అనేది రేవంత్ రెడ్డిని బాగా ఇబ్బంది పెట్టేసినట్టుగా ఉంది. అందుకే ఆయన ఇప్పుడు జైల్లో ఉన్న వారందరి మీదనా జాలి చూపిస్తున్నాడు. వాళ్లను వదిలేయండి.. అని అంటున్నాడు. వారి హక్కుల కోసం ఇప్పుడు ఆయన పోరాడుతున్నాడు కూడా!
ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లొచ్చాకా రేవంత్ రెడ్డిలో చాలా మార్పు కనిపిస్తోంది. జైళ్లలో సౌకర్యాలు సరిగా లేవని ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. సరైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆయన అంటున్నాడు.
అలాగే సత్ప్రవర్తన ఉన్న ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేయాలని కూడా రేవంత్ రెడ్డి కోరుతున్నాడు! ఈ మేరకు ఆయన తన ప్రియమైన శత్రువు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాయడం కూడా విశేషం. సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేయాలని రేవంత్ రెడ్డి కోరుతున్నాడు. ఈ మేరకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాడు.
సాధారణంగా తెలంగాణ సీఎంను రేవంత్ రెడ్డి ఏదీ కోరడు. ఏ విషయంలో అయినా కేసీఆర్ పై ధ్వజమెత్తడమే తప్ప మరో వ్యవహారం ఉండదు. అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నాడు. సత్ప్రవర్తన తో ఉన్న ఖైదీలను వదిలిపెట్టమని కోరుతున్నాడు. మొత్తానికి రేవంత్ రెడ్డికి జైలు జీవితంలో ఉన్న కష్టాలు అర్థమై.. ఖైదీల విషయంలో ఈ జాలిని ప్రదర్శిస్తున్నాడని అనుకోవాల్సి వస్తోంది.