రాజకీయాల్లో రాణించాలంటే మీడియా సపోర్ట్ ఉండాల్సిందే. ఎంతమంది అభిమానులున్నా ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్, డిజిటల్ మీడియా మద్దతు లేకపోతే ఎంత పెద్ద స్టారైనా, నాయకుడైనా వెనుకబడిపోవాల్సిందే. ఆ విషయం గ్రహించే పదేళ్ల క్రితమే వైఎస్ఆర్, జగన్ సాక్షికి జీవం పోశారు. తమ వాణి వినిపిస్తున్నారు, ఇప్పుడు కొత్త నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా తన గొంతును బలంగా ప్రజలకు వినిపించాలంటే మీడియా అండదండలు లేకపోతే కష్టమని ఇటీవలే గ్రహించారు. టీడీపీతో సత్సంబంధాలు ఉన్నంతవరకూ పవన్ స్పీచులకు, ఆయన పర్యటనలకు, అల్టిమేటమ్స్ కు ప్రాధాన్యత ఇచ్చిన ప్రముఖ పత్రికలు, టీవీ చానెల్స్ ఆ తర్వాత ఆయన టీడీపీకి దూరంగా జరగగానే అవి కూడా పవన్ కు దూరంగా జరిగిపోయాయి. అంతకుముందు రాజధాని రైతులతో పవన్ మాట్లాడితే రైతుబంధు అంటూ హెడ్డింగులు పెట్టి, లైవ్ లు ఇచ్చి మరీ కవరేజ్ ఇచ్చిన మీడియా ఆ తర్వాత స్వరం మార్చింది. రాజధాని రైతులుకు ఏ సమస్యలూ లేవు. పొలిటికల్ మైలేజ్ కోసం పవన్ కళ్యాణ్ రైతులను కావాలనే రెచ్టగొడుతున్నారు అనే విధంగా కథనాలు వండి వార్చి వడ్డించాయి. అంతేకాదు ఉద్దానం కిడ్నీ సమస్యపైనా పవన్ అల్టిమేటమ్ జారీ చేస్తే దాన్ని అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి ఇవే మార్గాలు చూపి, సానుకూల కథనాలతో హోరెత్తించేవి. అటు చంద్రబాబుకు ఇటు పవన్ కు మైలేజ్ ఇస్తూ తమకు టీఆర్పీలు వచ్చేటట్లు జాగ్రత్తలు పడేవి.
అయితే ప్రత్యేకహోదాపై మోసం చేసిన మోడీని పల్లెత్తు మాట అనకుండా టీడీపీపై విమర్శలతో పవన్ విరుచుకుపడిన మరుక్షణం మెజార్టీ మీడియా తమ స్వరం మార్చేసింది. పవన్ కు వ్యతిరేక కథనాలతో హోరెత్తిస్తున్నాయి. కత్తి మహేశ్, శ్రీరెడ్డి వ్యవహారంలోనూ పవన్ పై వాళ్లిద్దరూ తీవ్ర విమర్శల నేపథ్యంలోనూ పవన్ కు అండగా నిలవలేదు. నీ హుకుంలు, అల్టిమేటమ్స్ చెల్లవిక్కడ అన్న ధోరణితో పవన్ ఆక్రోషాన్ని తేలిగ్గా తీసిపారేశాయి. మీడియాను బెదిరిస్తావా ? మీడియాపై హుకుం జారీ చేస్తావా ? అంటూ ఎదురుదాడితో పవన్ ను ఇరకాటంలో పెట్టేశాయి. దీంతో తత్వం బోధపడిన పవన్ తనకు సొంత టీవీ చానెల్, పత్రిక ఉండాలని డిసైడయ్యాడు. తన పార్టీ టికెట్ ఆశిస్తున్న బడాబాబుల ద్వారా 99 టీవీ చానెల్ ను కొనేశాడు. తన సోషల్ మీడియా విభాగం నిర్వహిస్తున్న శతఘ్ని డిజిటల్ పత్రికను ఇటీవల శతజ్ఞి పక్ష పత్రికగా లాంచ్ చేశాడు. 15 రోజులకు ఒకసారి విడుదలయ్యే ఈ పత్రిక వెల 10 రూపాయలు. అయితే దాన్నే ఎన్నికల సమయానికి దినపత్రికగా మార్చాలని పవన్ ఆలోచన చేస్తున్నాడు. ప్రస్తుతానికి శతఘ్ని పక్షపత్రికలో పవన్ స్పీచులు మాత్రమే వస్తున్నాయి. ముందు ముందు మిగిలిన పత్రికల మాదిరిగానే అన్ని అంశాలతో దినపత్రికగా మార్చి జనంలోకి తేవాలనే ఆలోచనలో ఉన్నాడు.
అయితే అది అంత ఈజీ కాదు. దినపత్రిక నడపడం, టీవీ చానెల్ నిర్వహణ ఈ రోజుల్లో కత్తిమీద సామే. తెలుగు జర్నలిజానికి సంబంధించి సాక్షికి ముందు సాక్షి తర్వాత అనే చెప్పుకోవాలి. సాక్షి పత్రిక, టీవీ రాకముందు అరకొర జీతాలతో జర్నలిస్ట్ లు నెట్టుకొచ్చేవారు. ప్రముఖ పత్రిక, టీవీ చానెల్స్ గుత్తాధిపత్యంలో మింగలేక కక్కలేక అవస్థలు పడేవారు. సాక్షి రాకతో జర్నలిస్టులకు మంచి జీతాలతో పాటు ఉద్యోగ భద్రత దక్కింది. అందుకే వైఎస్ఆర్ ఫ్యామిలీని రాజకీయాల్లో జనంలో సజీవంగా ఉంచేందుకు చాలామంది జర్నలిస్టులు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. మరి పవన్ కొనుగోలు చేసిన 99 టీవీలో జీతభత్యాల విషయంలో తీవ్ర సమస్యలు మొన్నటి వరకూ ఉండేవి. ఇప్పుడు ఈయన కొనుగోలుతో అయినా ఆ చానెల్ లో పరిస్థితులు మారతాయని జర్నలిస్టులు ఆశిస్తున్నారు. మరోవైపు పక్షపత్రికను దినపత్రికగా మార్చే ఆలోచననూ స్వాగతిస్తున్నారు. కానీ ఎంతవరకూ విజయవంతంగా నిర్వహించగలరు ? ఎన్నికలు అయిపోగానే మూసేస్తారా ? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి శతఘ్ని పత్రికతో పవన్ వారికి ఏమేరకు భరోసా ఇవ్వగలడో వేచి చూద్దాం.