దేశంలో ప్రధానమంత్రి తో సహా ఎవరూ డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవలేదు..అని అంటున్నాడు తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. భారత రాజకీయాల్లో ఎవరూ డబ్బు ఖర్చు పెట్టకుండా గెలవలేదని.. కేసీఆర్ అయినా, చంద్రబాబు అయినా.. తను అయినా.. చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయినా డబ్బు ఖర్చు పెట్టే ఎన్నికల్లో గెలిచారని దివాకర్ రెడ్డి తేల్చి చెప్పాడు.
మరి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ ఇలా మాట్లాడొచ్చా? అనేది నైతికతకు సంబంధించిన అంశం. దివాకర్ రెడ్డి చాలా పచ్చిగా మాట్లాడాడు. ఎవరూ ప్రజాభిమానంతో గెలవలేదు.. డబ్బు పెట్టే గెలిచాడు అని దివాకర్ రెడ్డి తేల్చేశాడు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వస్తున్న విమర్శల గురించి స్పందిస్తూ దివాకర్ రెడ్డి ఇలా మాట్లాడాడు.
మరి ఒక ప్రజాసభలో ఇలా మాట్లాడిన దివాకర్ రెడ్డి ఇదే మాటనే ఈసీకి, కోర్టుకు చెప్పగలడా? తను ఎంపీ గా గెలిచింది డబ్బు పంచేనని ఆయన చెప్పగలడా?తనతో పాటు చంద్రబాబు, నరేంద్రమోడీలు కూడా డబ్బు పంచారని.. అలాగే గెలిచారని ఆయన న్యాయస్థానం ముందుకు వెళ్లి చెప్పవచ్చు కదా. అప్పుడు ఈయన సభ్యత్వం పోతుంది కదా!