జేడీఎస్ నేత కుమారస్వామి పట్టాభిషేకం అంగరంగ వైభవంగా ముగిసింది. ఆయన చేత కర్నాటక 24 వ ముఖ్యమంత్రిగా గవర్నర్ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. కుమారస్వామి వయసు 59.. బీఎస్సీ వరకు చదువుకున్న ఆయన.. 1996లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి.. 2006లోనూ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన విషయం తెలిసిందే.
అనంతరం ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు బి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 67 సంవత్సరాల పరమేశ్వర పీహెచ్డీ పట్టా పొంది అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రస్తుతం కేపీసీసీ అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఆయనకు గతంలో ఆ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
ప్రమాణస్వీకారోత్స వానికి సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, శరద్ యాదవ్, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, తదితర కీలక నేతలు కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు