తెలుగుదేశం పార్టీ అంగంరంగ వైభవంగా జరుపుకొంటున్న మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం దక్కలేదు. అదేమంటే.. హరికృష్ణను పిలించాం.. అదే ఆహ్వానం కిందే ఆయన తనయుడు తారక్ కూడా రావాల్సింది.. అన్నట్టుగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం నేతలు. చంద్రబాబు కు బాగా దగ్గరైన వారు.
హరికృష్ణ ఇంటి పెద్ద అని.. జూనియర్ కూడా అదే ఆహ్వానం కింద రావాలి కానీ.. ప్రత్యేక ఆహ్వానాలు మాత్రం ఉండవనేది వీరి మాట.
మరి ఒకప్పుడు అయితే చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపించాడు. ప్రత్యేకించి 2009 ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత జూనియర్ ఎన్టీఆర్ కు చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. అతడి చేత ఎన్నికల ప్రచారం చేయించుకొన్నాడు. ఎన్టీఆర్ ను అప్పట్లో చంద్రబాబు బాగా ఎంటర్ టైన్ చేశాడు. అయితే అందుకు తగ్గ ప్రయోజనాలు దక్కలేదు. ఆ ఎన్నికల్లోతెలుగుదేశం పార్టీ గెలవలేదు.
ఆ తర్వాత వివిధ పరిణామాలు బాబుకు. తారక్ కు దూరాన్ని పెంచాయి. 2014 ఎన్నికల సమయానికి వచ్చే సరికి అసలు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరం అయ్యాడు. ఇక బాబు కూడా తారక్ ను పూర్తిగా పక్కనపెట్టాడు. ఆ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో తారక్ అవసరం బాబుకు లేకుండా పోయింది. ఇదే సమయంలో తనయుడు లోకేష్ ను పార్టీకి హెడ్ గా చేసే పనిని పెట్టుకొన్నాడు బాబు. అఅలా చేయాలంటే.. జూనియర్ స్థాయిని తక్కువ చేయాలి. అందుకే ఆ హీరోకి ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించేశాడు. అందులో భాగంగా ఈ ఏడాది మహానాడుకు కూడా ఎన్టీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం దక్కలేదు.
ఇదే సమయంలో ఎన్టీఆర్ జయంతి వచ్చింది. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ తాతగారి జయంతికి సందర్భంగా ప్రత్యేకంగా యాడ్ ఇచ్చాడు. సదా నీ ప్రేమకు బానిసను అంటూ తారక్ తాతగారికి నివాళి ఘటించాడు. ఎన్టీఆర్ వారసుడిగా తనూ ఉన్నాననే విషయాన్ని గుర్తుచేస్తూ.. మహానాడు మూడ్ లో ఉన్న బాబు అండ్ కో కు హెచ్చరిక పంపినట్టుగా ఉన్నాడని విశ్లేషకులు అంటున్నారు.