కర్ణాటకలో కాంగ్రెస్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో శాసనసభ కొలువుదీరి కొద్దిరోజులు కాకముందే విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. గోవా నుంచి బాగల్కోటకు వస్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన న్యామగౌడను ఆయన అనుచరులు సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అక్కడే ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతోపాటు డ్రైవర్ కూడా మృతి చెందాడు.
ఎదురుగా వచ్చిన ట్రక్కును తప్పించబోయిన డ్రైవర్, పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జమాఖండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ శుబ్రావుపై 2795 ఓట్లతో న్యామగౌడ గెలుపొందారు. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తరఫున కుమారస్వామి సీఎంగా ఎన్నికైన విషయం తెలిసిందే. బాగల్కోట్ జిల్లా జామ్ఖండి నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు
జంఖండి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన భీమప్పకు ఈ సారి మంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోన్నవేళ ఆయన మరణవార్త అభిమానులను, కుటుంబసభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎమ్మెల్యే మృతి పట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర సంతాపం తెలిపారు. సోమవారం సాయంత్రమే గౌడ అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది.