పెద్దనోట్ల రద్దు విషయంలో మోడీకే సలహాలు.. సూచనలు ఇవ్వటంతో పాటు.. ఆయన చేసిన తప్పుల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. తనకు తెలీని కొత్త విషయాలపై పట్టు సాధించేందుకు సదరు అంశంపై వివిధ రంగాలకు చెందిన నిపుణులతో భేటీ అయి.. వారిచ్చే సలహాలు.. సూచనలపై మదింపు చేసి.. అంతిమంగా ఒక నిర్ణయానికి రావటం కేసీఆర్ కు అలవాటే.
తాజాగా పెద్దనోట్ల రద్దు విషయంలోనూ ఇదే ఫార్ములాను పాటిస్తున్నారు. పలువురు ఆర్థిక రంగ నిపుణులతో పాటు.. మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లతో భేటీ అయిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చెప్పొచ్చు. నోట్ల రద్దుపై ప్రధాని మోడీని కలిసి ఒక డీటైల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని అనుకున్న ఆయన.. తాజాగా అందుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వాస్తవానికి నోట్ల రద్దు అంశంపై ప్రధానితో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లాలని మొదట అనుకున్నా తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా చెబుతున్నారు.
ఈ నెల 25నుంచి మూడు రోజులు పాటు హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ ఆకాడమీలో జరిగే అన్నీరాష్ట్రాల డీజీపీల సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఈ సమావేశం ప్రారంభమైన రోజునే ప్రధాని మోడీతో భేటీ అయి.. పెద్దనోట్లరద్దుపై తాను చేసిన అధ్యయనం.. కసరత్తులను వివరించి.. ఈ నిర్ణయంతో రాష్ట్రాలు ఎంతలా ప్రభావితం అవుతున్నాయన్న విషయాన్ని సవివరంగా ఆయనకు చెప్పాలని భావిస్తున్నారు.