దేవభూమిగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరొందిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. టూరిజానికి కేరళ అందాలు పెట్టింది పేరు. అలాంటి కేరళ వరద బీభత్సానికి అతలా కుతలం అవుతోంది. కేరళ అంతా ఎటు చూసినా మోకాళ్లలోతు నీళ్లు.. పీకల్లోతు కష్టాలు.. ఏకంగా ఊరుకు ఊర్లే మునిగిపోయి.. వరదనీటిలో చెరువును తలపిస్తున్న వైనం. చుట్టూ చేరిన వరదనీళ్లతో బిక్కుబిక్కుమంటూ ఎటుపోవాలో తెలియక అల్లాడుతున్న ప్రజలు. ఇది కేరళలోని పరిస్థితి.
గత తొమ్మిది రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో మలయాళ సీమ మరుభూమిని తలపిస్తోంది. ఎప్పుడూ ఏ వైపునుంచి వరద ప్రవాహం ముంచుకొస్తుందోనని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.ప్రజలు ఎక్కడకూ వెల్లలేని పరిస్థితి. ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూపులు. గత వందేళ్లలో కనీవిని ఎరగని స్థాయిలో వరదలు రావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా 324 మంది ప్రాణాలు వదిలారు. కేరళలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారడంతో.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు కంటిమీద కునుక లేకుండా జీవనం గడుపుతున్నారు.
కేరళ విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు (ఎన్డీఆర్ఎఫ్) ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. 1300 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. గత పది రోజులుగా భారీ వర్షాల ధాటికి చిగురుటాకులా వణికిపోతున్న కేరళలో ప్రధాని మోదీ శనివారం పర్యటించారు. కేరళ సీఎం, అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు.
మరోవైపు కేరళలో ప్రకృతి ప్రకోపానికి రహదారులు కొట్టుకుపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు గ్రామాలునీటమునగడంతో ఎయిర్ లిఫ్ట్ విధానం ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనేక గ్రామాలు బాహ్యప్రపంచంతో సంబాధాలు తెగిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కొచ్చిన్ ఎయిర్పోర్టులో నీరు వచ్చి చేరడంతో విమాన సర్వీసులను సోమవారం(ఈ నెల 20) వరకూ నిలిపివేసినట్లు ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు.