రుణాల పేరుతో మోసాలకు పాల్పడిన ముఠా అరెస్టు అయింది. ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు చైనీయులు పరారీలో ఉన్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. 20 వేలమంది బాధితులను నిందితులు మోసం చేశారన్నారు. రూ.50 కోట్ల మోసాలకు నిందితులు పాల్పడ్డారు. నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు.
రాయదుర్గం పీఎస్లో నమోదైన కేసులో దర్యాప్తు చేపట్టగా… ముగ్గురుని అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి 4 లాప్టాప్లు, రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. డిపాజిట్ చేస్తే.. అధిక వడ్డీ ఇస్తామని ఆశచూపి 20వేల మంది నుంచి డబ్బులు తీసుకున్నట్లు వివరించారు. 90 రోజుల వ్యవధిలో 4 రెట్లు అధికంగా డబ్బులు ఇస్తామని నమ్మించారని పేర్కొన్నారు. ప్రజలను ఆకర్షించడానికి వాట్సాప్ ద్వారా ప్రకటనలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.