స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదట ప్రాధాన్య అంశంగా శాంతి, భద్రతలు ఎంచుకుంది. ఏ శాఖకు ఇవనన్నీ నిధులు, ప్రాధాన్యం పోలీస్ శాఖకు ఇచ్చింది. అందుకే ఫ్రెండ్లీ పోలీస్, స్మార్ట్ పోలీస్, స్పీడ్ పోలీస్గా తెలంగాణ పోలీసులు పేరు పొందుతున్నారు. దీనికి గుర్తింపుగా తెలంగాణ హోంమంత్రికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
రామ్ మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం లభించింది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బుధవారం లోహియా విచార్మంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆ పురస్కారాన్ని నాయిని నర్సింహారెడ్డికి ప్రదానం చేశారు. రామ్ మనోహర్ లోహియా అడుగు జాడల్లో పని చేస్తున్న నాయినికి రామ్ మనోహర్ లోహియా పురస్కారానికి సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. మత్య్స శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జస్టిస్ సుభాశ్రెడ్డి, సాహిత్యవేత్త దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొని నాయినిని అభినందించారు.