Friday, March 29, 2024
- Advertisement -

కాళేశ్వరం ‘మేఘా’ నీటి పంపింగ్

- Advertisement -

ఇంజనీరింగ్‌ చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా, ఇంజనీరింగ్‌ నిపుణులు సైతం నివ్వెరపోయేలా భూగర్భంలో ‘మేఘా’నీటి పంపింగ్‌ కేంద్రం నీటిని పంప్‌ చేయడం ప్రారంభించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు, పరిశోధనలు, నిర్మాణాలు ప్రపంచ గమనాన్ని వేగిరం చేయగా తెలంగాణాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్‌ కేంద్రం వాటి సరసన చేరి పంపింగ్‌ కేంద్రాల నిర్మాణంలో అగ్రభాగాన నిలబడింది. ఈ పంపింగ్‌ కేంద్రం వ్యవసాయ-ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రోమెకానికల్‌) చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించి భవిష్యత్‌లో అన్నదాత నీటిసమస్యలు తీర్చే కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. ఎంత లోతున నీరు వున్నా, ఎంత ఎత్తులో అవసరమైనా వ్యవసాయం కోసం నీటిని పంప్‌ చేసే విధంగా పంపింగ్‌ కేంద్రాన్ని నిర్మించడం సుసాధ్యమని మేఘా నిరూపించింది. అన్నింటా అరుదుగా నిలిచిపోయే లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూగర్భ పంపింగ్‌ కేంద్రంలోని 5వ పంపు నుంచి నీటి పంపింగ్‌ ఆదివారం రాత్రి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. సుమారు 3000 క్యూసెక్కుల నీరు 111 మీటర్ల ఎగువకు ఎగజిమ్మింది. ఉవ్వెత్తున లేచివచ్చిన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ఆగష్టు 14, బుధవారం నాడు 4,5 పంపులను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.

“తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం మేఘా ఇంజినీరింగ్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు ప్రపంచంలో అత్యుత్తమ ఇంజినీరంగ్‌ సంస్థలతో కలిసి పనిచేయడం, అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించిన జీవిత కాలపు అవకాశంగానూ, గౌరవంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనే తక్కువ కాలంలో పూర్తి చేయడం సాధ్యమైంది. ” అని బి. శీనివాస్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

‘మేఘా మహాద్భుత సృష్టి
ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంతకుముందు ఎక్కడా లేనిది. అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్ధ్యాల ప్రకారం, నీటి పంపింగ్‌ లక్ష్యం, పరిమాణం… ఇలా ఏ ప్రకారం చూసుకున్నా అదొక ఇంజనీరింగ్‌ కళాఖండం. మేఘా ఇంజనీరింగ్‌ తన సాంకేతిక శక్తి సామర్ధ్యాలతో నిర్మించిన మహాద్భుత సృష్టి. మానవనిర్మిత ప్రపంచ అద్భుతాల్లో ఇది ముందువరసలోకి చేరుతుంది. అదే కాళేశ్వరం పథకంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూ గర్భ పంపింగ్‌ కేంద్రం. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్‌ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఒక్కో మిషన్‌వారీగా చూస్తే సామర్ద్యం 139 మెగావాట్లు కావడంతో ప్రపంచంలో ఇదే పెద్దది. ఇక మొత్తం పంపింగ్‌ కేంద్రం ప్రకారం చూసినా 973 మెగావాట్లు కూడా అతిపెద్దది. ఇందులో వినియోగించిన ఎలక్ట్రికల్‌ మోటార్‌ పంప్‌హౌస్‌ల్లోనే కాకుండా మొత్తంగా ప్రపంచంలో ఏ రంగంలోనూ అంటే పరిశ్రమలు, విద్యుత్‌ ఉత్పత్తి, మరే ఇతర రంగాల్లోనూ ఇంత పెద్దది లేదు. దీన్ని బట్టి ఈ పంపింగ్‌ కేంద్రం మేఘా స్థాయి ఎంత గొప్పదో ఊహించుకుంటేనే విస్తుపోక తప్పదు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 2 టీఎంసీల పంపింగ్ కు గాను మొత్తం 4627 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం అవసరం కాగా ఎంఐఈఎల్‌మాత్రమే 3057 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన పంపులను ఏర్పాటు చేస్తూ తన శక్తి సామర్థ్యాలు చాటుకుంది. సాగునీటి రంగంలో ఎత్తిపోతల పథకంలోని పంపులకు ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్‌సామర్థ్యం వ్యవస్థను ఏర్పాటు చేయడం ఓ రికార్డ్‌. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడు భారీ స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేయలేదు.

మూడున్నరేళ్లలోనే…
అసలు ఎత్తిపోత పథకాలే ఇంత పెద్ద స్థాయిలో భారీ శక్తి సామర్ధ్యాతో భూ ఉపరితలంపై కూడా ఇప్పటికీ ఎక్కడా లేవు. అటువంటిది ఇక్కడ భూగర్భంలో ప్రపంచంలోనే పెద్దది నిర్మించడం అందులోనూ రోజుకు కనీసం 2 టిఎంసీల నుంచి గరిష్టంగా 4.5 టిఎంసీలను 111.4 మీటర్ల ఎగువకు పంప్‌ చేయడం అనేది అసామాన్యమైనది. సవాళ్లను ఎదుర్కొని తన శక్తి సామర్ధ్యాలతో మేఘా ఇంజనీరింగ్‌ ఈ పంపింగ్‌ కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చింది. అదీ కేవలం మూడున్నరేళ్లలోనే. సాధారణ పథకాల నిర్మాణాలు సైతం దశాబ్దాల సమయం పడుతున్న పరిస్థితుల్లో ఈ పథకంతోపాటు ఈ పంపింగ్‌ కేంద్రాన్ని యుద్ధప్రాతిపదికన వేగంగా నిర్మించి రైతులకు అంకితం చేయడం మేఘా ఇంజనీరింగ్‌కే సాధ్యమైంది. ఈ పథకంలో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశిష్టతలు. ఆశ్చర్యగొలిపే విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఇంజనీరింగ్‌ కళాఖండాన్ని ఆవిష్కరింపచేసింది. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. వ్యవసాయ-ఇంజనీరింగ్‌ రంగంలో అగ్రభాగాన నిలబడింది. దిగువన వున్న గోదావరి నీటిని ఎగువప్రాంతాల్లో వున్న రైతు భూముల చెంతకు చేర్చేందుకు మరెక్కడా లేని పథకం అమల్లోకి వచ్చింది.

ఈఫిల్‌ టవర్‌ కన్నా పెద్దది..
లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్‌ కేంద్రం పొడవు ఈఫిల్‌ టవర్‌ పొడవు కన్నా ఎక్కువ. ఈఫిల్‌ టవర్‌ ఎత్తు 324 మీటర్లు కాగా, ఈ పంప్‌హౌస్‌ పొడవు 327 మీటర్లు. కలకత్తాలోని దేశంలోనే అతిపొడవైన భవంతి ‘ది 42’ కంటే ఈ పంప్‌హౌస్‌ లోతు ఎక్కువ. ‘ది 42’ పొడవు 260 మీటర్లు. దానితో పోల్చితే ఈ పంప్‌హౌస్‌ ఎంత లోతైనదో (కింద నుంచి చూస్తే ఎత్తు) తెలిస్తే విస్తుపోక తప్పదు. ఈ పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.3 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని మేఘా ఇంజనీరింగ్‌ బయటకు తీసింది. మొత్తంగా లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్‌ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు.

“ఈ భారీ పంప్‌హౌస్‌లో విశిష్టత అంతా జంట టన్నెల్స్. ఈ రెండింటినీ పక్కపక్కనే 10 మీటర్ల వ్యాసంతో భూమిని తవ్వి ఒక్కో టన్నెల్‌ను 4133 మీటర్ల పొడవుతో నిర్మించాం. సర్జ్‌పూల్‌, అదనపు సర్జ్‌పూల్స్‌ కూడా ప్రపంచంలోనే అతి పెద్దవి. భూగర్భంలో ఇంత భారీ ఎత్తున నిర్మాణాలు జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి. 470 అడుగుల దిగువన 327 మీటర్లు పొడవు, 25 మీటర్ల వెడల్పు, 65 మీటర్ల ఎత్తుతో ఈ పంప్‌హౌస్‌ నిర్మాణం అంటే అది ఎంత పెద్దదో ఊహించవచ్చు” అని బి. శ్రీనివాస్‌రెడ్డి పంప్‌హౌస్‌ విశిష్టతలను వివరించారు.

అత్యధిక మేఘా వాట్ల సామర్థ్యం…
పంప్‌ చేయడానికి అవసరమైన నీటిని నిల్వ చేయడం కోసం నిర్మించిన సర్జ్‌పూల్‌ కూడా ఈఫిల్‌ టవర్‌ కన్నా పొడవులో పెద్దది. మొత్తం 4 సర్జ్‌పూల్స్‌ ఉండగా అందులో ప్రధాన సర్జ్‌పూల్‌ 325 మీటర్ల పొడవుతో నిర్మించడం ప్రపంచంలోనే అరుదైన ఇంజనీరింగ్‌ అద్భుతం. ప్రపంచంలో కొలరాడో (అమెరికా), గ్రేట్‌ మేన్‌మేడ్‌ రివర్‌ (లిబియా) లాంటి ఎత్తిపోత పథకాలు ఇప్పటి వరకూ అతిపెద్దవి కాగా కాళేశ్వరం ముందు అవి చిన్నవైపోయాయి. ఒక్కో మిషన్‌ వారీగా చూసినా మొత్తం అన్ని మిషన్లు సామర్ధ్యంతో పోల్చి చూసినా లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూగర్భ పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలోనే అతి పెద్దది. పైగా ఇది భూగర్భంలో నిర్మించింది కావడం మరో ప్రత్యేకత.

ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో 5 మిషన్లను పంపింగ్‌కు సిద్ధం చేయగా ఇవి ఎంత పెద్దవంటే అనుబంధ పరికరాల తో కలిపి ఒక్కో మిషన్‌ బరువు 2376 మెట్రిక్‌ టన్నులు. ఒక్కో లారీలోను 20 టన్నుల సరుకు రవాణా చేస్తుంటారు. మిషన్‌లో ప్రధానమైనవి స్టార్టర్‌, రోటర్లు. స్టార్టర్‌ బరువు 216 టన్నులు కాగా రోటర్‌ బరువు 196 టన్నులు. సాధారణంగా 200 టన్నుల బరువు మోసే క్రేన్లు ఉండవు. ఇక్కడ వీటిని కదిలించడానికి రెండేసి క్రేన్లను వినియోగిస్తున్నారు. తద్వారా 300 టన్నులు బరువు మోయగలిగిన ఇఒటి క్రేన్‌ సముదాయాన్ని ఏర్పాటు చేశారు.

ఈ పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం 6 వేల టన్నుల స్టీల్‌తో పాటు 50 వేల టన్నుల సిమెంట్‌ కాంక్రీట్‌ వినియోగించారు. ఇక్కడి నుంచి కనీసం రోజుకు 2 టిఎంసీల నీటిని పంప్‌ చేసే విధంగా నిర్మాణ పని పూర్తయింది. ఈ మిషన్లు పని చేయడం ప్రారంభం కాగానే నాగార్జున సాగర్‌ కుడికాలువ ప్రవాహం ఎంత పెద్దదో అంతకన్నా రెండింతలు పెద్దగా నీరు ప్రవహిస్తుంది. అక్కడ సామర్ధ్యం 11,000 క్యూసెక్కులు అయితే ఇక్కడ 22,000 క్యూసెక్కుల నీరు పంపింగ్‌ ద్వారా వస్తుంది.

భూగర్భం నుంచి 111.4 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్‌ చేసే విధంగా మిషన్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా 30 లేదా 40 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్‌ చేయడమే అరుదు. అటువంటిది ఈ పథకంలో అంత ఎత్తుకు రోజుకు కనీసం 2 టిఎంసీల నుంచి గరిష్టంగా 4.5 టిఎంసీల వరకు పంప్‌చేసే సామర్ద్యం వుందీ అంటే ఈ మేఘా పంపింగ్‌ కేంద్రం ఎంత ఘనమైనదో ఊహించుకోవచ్చు. మేఘా ఇంజనీరింగ్‌తో పాటు దేశీయ ప్రభుత్వ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ దిగ్గజం బిహెచ్‌ఇఎల్‌తోపాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విదేశీ కంపెనీలు Telk, Siemens, Wartsila, MMT, LS Cables, Hilti, Atlas Copco, Normet, Sandvik తదితర సంస్థలు మేఘా ఇంజనీరింగ్‌కు తమ సేవలను అందించాయి. ఇందులో 160 ఎంవిఎ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఒక్కో మిషన్‌కు ఒక్కోటి చొప్పున అమర్చారు. 400 కెవిఎ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ ద్వారా మిషన్లకు సరఫరా అవుతుంది.

ప్రపంచంలో అతి పెద్ద పంప్‌హౌస్‌ను అతిస్వల్పకాలంలో పూర్తి చేసిన సందర్భంగా మేఘా ఇంజినీరింగ్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ డైరెక్టర్‌ శ్రీ బి. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ “ఇదొక అత్యద్బుతమైన అండర్‌గ్రౌండ్‌ పంప్‌హౌస్‌. భూమికి 470 అడుగుల దిగువన, జంట టన్నెల్స్‌తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద సర్జ్‌పూల్స్‌ నిర్మించాం. ఈ అల్డ్రా మెగా ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్థ్యం గల 5 మెషీన్లతో రోజుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేయగల సామర్థ్యంతో నెలకొల్పాం. ఈ మెషీన్లను కంప్యూటేషనల్‌ ఫ్ల్యూయిడ్ డైనమిక్స్‌ (సీఎఫ్‌డీ) టెక్నాలజీతో దేశంలో తయారు చేసి మేక్‌ ఇన్‌ ఇండియాకు ప్రతిరూపంగా ఈ పంప్‌హౌస్‌ను నెలకొల్పాం. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతి పెద్ద విద్యుత్‌ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాం. అందులో 400 కేవీ 220కేవీ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, 260 కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, ఏడు కిలోమీటర్ల మేర 400 కేవీ ఎక్స్‌ఎల్‌పీఈ అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఏ రకంగా చూసినా ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే వినూత్నమైన మెగా ప్రాజెక్టు. ఈ మహాఅధ్బుతమైన ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తి చేసిన ఘనత మేఘా ఇంజినీరింగ్‌కే దక్కుతుంది” అని అన్నారు.

శ్రీశైలం లేదా నాగార్జున సాగర్ జల విద్యుత్ తో సమానం..
సాధారణంగా నీటి పంపింగ్‌ కేంద్రాలు భూ ఉపరితలం మీదే వుంటాయి. మొట్టమొదటిసారిగా అతిపెద్ద పంపింగ్‌ కేంద్రాన్ని భూగర్భంలో మేఘా ఇంజనీరింగ్‌ నిర్మించింది. దీని విద్యుత్‌ వినియోగ, పంపింగ్‌ సామర్ధ్యం 973 మెగావాట్లు అంటే నమ్మగలరా? విడివిడిగా చూస్తే శ్రీశైలంలోని రెండు జలవిద్యుత్‌ కేంద్రాల కన్నా, నాగార్జునసాగర్‌లో ఒక జలవిద్యుత్‌ కేంద్రం ఉత్పత్తి స్థాయి కన్నా దీని వినియోగం ఎక్కువ. వాస్తవానికి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, పంప్‌హౌస్‌ వేర్వేరు రకాలు. కాని విద్యుత్‌ పరిమాణాన్ని ఉదహరించడానికి అలా చెప్పాల్సి వచ్చింది.

ఉపరితలంలో నిర్మించే పంప్‌హౌస్‌కు పునాదులతోపాటు నిర్మాణ సమయంలోనూ మార్పులు- చేర్పులు సులభమవుతాయి. కానీ భూగర్భ పంపింగ్‌ కేంద్రాన్ని నీటి లభ్యత, నీటిమట్టం ఆధారంగానే అవసరమైన లోతులో నిర్మించాలి. ఇష్టం వచ్చిన తరహాలో భూగర్భంలో మార్పులు- చేర్పులు చేయడానికి వీలు పడదు. అంటే నిర్మాణ పరంగా ఎంత క్లిష్టమైన పనిని మేఘా ఇంజనీరింగ్‌ తన సాంకేతిక శక్తి సామర్ధ్యాలతో మూడున్నరేళ్లలో పూర్తి చేసిందో ఊహించుకుంటేనే విస్తుపోక తప్పదు. పంప్‌హౌస్‌ ఆకృతి నిర్మాణంలో కీలకమైన ప్రదేశాలు.. సర్వీస్‌బే: భూమి ఉపరితలం నుంచి 210 మీటర్లు లోతున వుండగా, పంప్‌బే: 190.5 మీటర్లు, యాన్సిరీ బే: 195.5 మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌బే: 215 మీటర్లు, కంట్రోల్‌ రూం: 209 మీటర్లు లోతున వున్నాయి. కాళేశ్వరం పథకంలో మొత్తం 22 పంపింగ్‌ కేంద్రాలను (ఈ పథకం బహుళదశ ప్రపంచంలో పెద్దది) నిర్మిస్తుండగా అందులో 17 కేంద్రాలను ఎంఇఐఎల్‌ నిర్మిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -