కరోనా మహమ్మారి ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. అందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ సూచనలు పాటిస్తున్నారు. దేశంలో 21 రోజుల లాక్ డౌన్ వేళ ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాజాగా టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు ఓ పాటలో పిలుపునిచ్చారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. సామాజిక దూరం పాటించి ఈ వైరస్ ను తరిమికొట్టాలని కోరారు.
తెలుగులో సీనియర్ సంగీత దర్శకుడు కోటి రూపొందించిన పాటలో అందరికీ అర్థమయ్యేలా చిరు, నాగ్, వరుణ్, సాయిధరమ్ తేజలు నటించి కరోనాపై ఫైట్ కు పాట రూపంలో పిలుపునిచ్చారు. ఈ పాట వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా డీడీ న్యూస్ ఏప్రిల్ 2న ఈ పాటను ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను శుక్రవారం చూసిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వెంటనే స్పందించారు. ఏకంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ తెలుగు భాషలో ట్వీట్ చేశారు.
‘చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ కి మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.. అందరం మన ఇళ్లలోనే ఉందాం.. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనాపై విజయం సాధిద్ధాం’ అంటూ ప్రధాని ట్వీట్ చేయడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ సందర్భంగా మన హీరోలను ప్రత్యేకంగా అభినందించడం విశేషంగా మారింది.