కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారని, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయస్ జగన్ చర్చించారన్నారు.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తే బాగుంటుందని సీఎం సూచించారని, రాష్ట్రంలో టెస్టింగ్ కెపాసిటీని పూర్తిగా వినియోగించుకోవాలని ఆదేశించారన్నారు.
వ్యాక్సినేషన్కు మొదటి నుంచి అత్యంత ప్రాధాన్యమిస్తూ విజయవంతంగా నిర్వహిస్తున్నామని, వ్యాక్సిన్ ప్రజలకు మరింత చేరువలో తీసుకెళ్లడం కోసం సీఎం వైయస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని… 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సున్న వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేయాలని.. రాష్ట్ర వ్యాప్తంగా 18–45 ఏళ్ల వయస్సు ఉన్న సుమారు 2.04 కోట్ల మందికి రూ.1600 కోట్ల నిధులు ఖర్చు చేసి ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.