తిరుమల తిరుపతి ఆలయంలో లడ్డూ నాణ్యతపై వివాదం నెలకొంది. ఈ మేరకు టీడీపీ సైనికుడు చేసిన పోస్టు వైరల్గా మారింది. @JaiTDP పేరుతో సోషల్ మీడియాలో స్పందించారు టీడీపీ సైనికుడు నవీన్ రెడ్డి. మార్చి 18న తన 6 నెలల చిన్నారితో కలిసి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు తెలిపాడు.
దర్శనం అనంతరం కౌంటర్ నంబర్ 13 వద్ద లడ్డూ ప్రసాదం తీసుకున్నానని, అయితే దాని నాణ్యతపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. తాను తీసుకున్న లడ్డూలు చాలా గట్టిగా ఉన్నాయని వాటిపై బూజులాంటి తెల్లటి జాలీ కనిపించిందని అతను పేర్కొన్నాడు.
ఆ సమయంలో నా దగ్గర ఫోన్ ఉండి ఉంటే ఫోటోలు తీసి చూపించేవాడిని” అని కూడా తన పోస్టులో పేర్కొన్నాడు. తాను టీడీపీ అనుచరుడినని పేర్కొన్న నవీన్ రెడ్డి, ప్రసాదం నాణ్యతపై అధికారులు సమగ్రంగా తనిఖీలు చేయాలని కోరాడు.
ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు భక్తులు కూడా లడ్డూ నాణ్యతపై తమ అనుభవాలను పంచుకుంటుండగా, మరికొందరు ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. భక్తులకు అందించే ప్రసాదం నాణ్యతపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరపాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

