సంచలనాల దర్శకుడు రామ్గోపాల్ వర్మకు చిక్కు పడే అవకాశం ఉంది. కేసుల మీద కేసులు నమోదవుతుండడంతో వర్మ ఇక జైలు కెళ్లాల్సి వస్తుందేమోనని అందరూ కంగారు పడుతున్నారు. వర్మ తీసిన వెబ్ సిరీస్ ‘గాడ్ ట్రూత్ సెక్స్ (జీఎస్టీ)’ వర్మకు ఉచ్చు బిగిస్తోంది. మియా మల్కోవ అందాలను అంగాంగం వర్ణిస్తూ కొన్ని సూక్తులు చెబుతూ యూట్యూబ్లో ఓ వీడియో విడుదల చేశారు.
అప్పటి నుంచి వర్మకు వివాదాలు చుట్టుముట్టాయి. హైదరాబాద్లో ఇప్పటికే కేసు నమోదు అయ్యి విచారణ కొనసాగుతుండగా.. ప్రస్తుతం విజయవాడలో ఒకటి ఇప్పుడు విశాఖపట్టణంలోని సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో తనను రామ్గోపాల్ వర్మ బెదిరించాడంటూ బీజేపీ నాయకురాలు తుమ్మల పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పద్మ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు 506, 509 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇప్పటికే జీఎస్టీ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకున్న ఆర్జీవీని హైదరాబాద్లో సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. మొదటిసారి విచారణ ముగిసినా… రెండోసారి ప్రశ్నించాలని భావించిన సీసీఎస్ వర్మను మళ్లీ పిలిచింది. నిన్న వర్మ రావాల్సి ఉండగా… ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందక పోవడంతో విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా వర్మపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. చివరికి ఏమవుతుందో చూడాలి.