మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీలో కీలక భూమిక పోషించిన అగ్రనేత పసునూరి నరహరి అలియాస్ సంతోష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) అధికారుల సమక్షంలో ఆయన జనజీవన స్రవంతిలోకి చేరారు.
మావోయిస్టు పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార విభాగమైన సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న పసునూరి నరహరి లొంగుబాటు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. కేవలం నరహరి మాత్రమే కాకుండా, ఆయన భార్య (ఆమె కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు) కూడా పోలీసులకు లొంగిపోవడం గమనార్హం.
పసునూరి నరహరి ప్రస్థానం..సాధారణ దళ సభ్యుడిగా ప్రారంభమైంది. తన పనితీరు, సిద్ధాంతంపై పట్టుతో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు.నరహరి స్వస్థలం తెలంగాణలోని వరంగల్ జిల్లా. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పార్టీలోకి వెళ్లి జాతీయ స్థాయి నేతగా ఎదిగిన అతికొద్ది మందిలో ఆయన ఒకరు.
నరహరి లొంగుబాటుకు ప్రధానంగా అనారోగ్య సమస్యలు మరియు పార్టీ సిద్ధాంతాల పట్ల మారుతున్న ధోరణులు కారణమని సమాచారం. దశాబ్దాల పాటు అడవుల్లో గడిపిన ఆయన, ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
