పవన్ కల్యాణ్ ఫ్యాన్స్-మహేష్ కత్తి మధ్య వివాదం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. దాదాపు నాలుగు నెలల నుంచి ఇరువురి మధ్య ఎడతెగని వివాదం రగులుతూనే ఉంది. హీరోయిన్ పూనంకౌర్ ఎంట్రీతో వివాదం మరో మలుపు తిరిగింది. దాంతో కత్తి, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
అయితే తాజాగా ఈ వివాదంలోకి ఉస్మానియా విద్యార్థులు జోక్యం చేసుకున్నారు. ఊహించని విధంగా ఓయూ విద్యార్థులు కత్తికి మద్దతు పలికారు. కత్తి మహేశ్పై పవన్ అభిమానులు దాడి చేస్తే పవన్ కల్యాణ్ను తెలంగాణలో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. పవన్ అభిమానులు దాడిచేస్తే వారి అడ్డుకుంటామని, పవన్ సినిమాలను తెలంగాణలో అడనివ్వబోమని వ్యాఖ్యానించారు.
గురువారం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన కత్తి మహేశ్కు మద్దతుగా పెద్ద ఎత్తున జేఏసీ విద్యార్థులు తరలివచ్చారు. ‘పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అంటూ వారు నినదించారు. కత్తికి తమ మద్దతు ప్రకటిస్తూ పవన్ అభిమానులకు, పవన్కు హెచ్చరికలు జారీ చేశారు. మహేశ్పై దాడి జరిగినట్టు తెలిస్తే పవన్ను తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.
మరోవైపు కత్తి మహేశ్ మాట్లాడుతూ..పవన్ తన అభిమానులను వేరే పార్టీలకు అమ్ముకుంటున్నాడని ఆరోపించాడు. అభిమానులను తనపైకి ఉసిగొల్పుతున్నాడని అన్నాడు. ఇప్పటికైనా ఆయన తన అభిమానులను అదుపులో పెట్టుకోవాలని సూచించాడు.
మరోవైపు రచయిత కోన వెంకట్ చెప్పిన ‘జనవరి 15’ డెడ్ లైన్ దగ్గరపడుతోంది. అప్పటిదాకా సంయమనం పాటించాలని చెప్పిన కోన వెంకట్.. ఆరోజు ఎలాంటి చర్యలకు దిగబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.