కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ మూవీపై వివాదం కొనసాగుతోంది. ఈ మూవీలో కొన్ని డైలాగులు నోట్ల రద్దును, జీఎస్టీలను టార్గెట్ చేస్తూ ఉండటంతో కొందరు తమిళ బీజేపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. రాహుల్ ట్వీట్లో ‘మిస్టర్ మోదీ సినిమా అనేది తమిళ సంస్కృతి, భాషల పరిపూర్ణ వ్యక్తీకరణ.
‘మెర్సల్’లో జోక్యం చేసుకుని తమిళుల ఆత్మగౌరవాన్ని రద్దు చేసే ప్రయత్నం చేయవద్దు’ అని పేర్కొన్నారు. అయితే మెర్సల్ మూవీకి సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ రావడం వల్ల ఆ మూవీ అంశంలో జోక్యం చేసుకోబోమని ఇప్పటికే కేంద్ర సమాచారా శాఖ స్పష్టం చేసింది. అయితే సినీ నిర్మాత మధుర్ భండార్కర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని తప్పుబట్టారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) నేపథ్యంలో తాను నిర్మించిన చిత్రం విషయంలో కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని విమర్శించారు.
ఇంకోవైపు నెటిజన్లు కూడా రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తున్నారు. కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’పై కాంగ్రెస్ మద్దతుదారులు ఎందుకు దాడి చేశారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మెర్సల్ వివాదంపై కమల్ హాసన్ కూడా స్పందించారు. మెర్సల్కు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చాక మళ్లీ సెన్సార్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. విమర్శలను లాజికల్గా ఎదుర్కోవాలని, విమర్శకులను అడ్డుకోవడం సరికాదన్నారు.