సినీ రంగమైనా, రాజకీయ రంగమైనా వివాదాస్పద పోస్టులతో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే వ్యక్తి దర్శకుడు రాంగోపాల్ వర్మ. ప్రతీ విషయాన్ని వివాదాస్పదం చేసి నిత్యం జనం నోళ్లలో నానాలనుకునే వారిలో వర్మ ముందుంటాడు. వంగవీటి రంగాపై వైసీపీ నుంచి సస్పెండైన నేత గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే విజయవాడ అట్టుడుకుతోంది. వీటికి మరింత ఆజ్యంపోశాడు రాంగోలాల్ వర్మ.
వంగవీటి రంగా ఫ్యామిలిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న విజయవాడలో వంగవీటి రంగా కుటుంబం పోలీస్ స్టేషన్లో కింద కూర్చుని ఉన్న ఫొటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి.. కొన్ని వివాదాస్పద రాతలకు రాంగోపాల్ వర్మ తెరలేపాడు. తనకు వంగవీటి భార్య, కొడుకు అంటే ఎనలేని ప్రేమ అంటూ వర్మ వెటకారపు పోస్ట్ పెట్టాడు. అంతేకాదు, స్టేషన్లో ఇలా కూర్చున్నందుకు వంగవీటి రంగా తన భార్య, కొడుకు పట్ల ఎంతో గర్వంగా ఫీలవుతాడని, స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ కూడా వేస్తాడని పోస్ట్ పెట్టి రాంగోపాల్ వర్మ సరికొత్త వివాదాన్ని సృష్టించాడు.
అంతటితో ఊరుకుండకుండా తల్లి ఎందుకు నల్లగా ఉందో, కొడుకు ఎందుకు తెల్లగా ఉన్నాడో లోరియల్ కాస్మొటిక్ కంపెనీ చెప్పాలని వర్మ చేసిన పోస్ట్పై పెనుదుమారమే రేగుతోంది. రాంగోపాల్ వర్మ వంగవీటి చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో ఆ కుటుంబం అతనికి సహకరించకపోవడమే ఈ వికృతానందానికి కారణమని నెటిజన్లు భావిస్తున్నారు. వర్మ వ్యాఖ్యలు విజయవాడలో ఇంకా ఎలాంటి వివిదాలకు దారి తీస్తాయో చూడాలి.