ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యవహరిస్తున్న శైలి మీద టీడీపీ శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అన్ని పార్టీలనీ సమానంగా చూడాల్సిన ఆయన సాంప్రదాయాలు పక్కకి పెట్టి తీవ్రంగా ప్రవర్తిస్తున్నారు అని రేవంత్ ఆరోపిస్తున్నారు.
విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం మంగళవారం రాత్రి రాజ్ భవన్ లో గవర్నర్ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విందు కార్యక్రమానికి రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పలువురు నేతలు.. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విందునకు గవర్నర్ సంప్రదాయాల్ని పక్కన పెట్టారన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ.తమ అధినేతకు పిలుపులు వచ్చినా.. విందుకు అందరిని పిలవలేదని.. అన్నిపార్టీలకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు.
రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చిన విందునకు అన్ని వర్గాల వారు హాజరై ఉంటే ఎంతో మర్యాదగా.. హుందాగా ఉండేదోనన్న ఆయన.. ఈ విషయం ఆయనకు తెలీదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. విందుకు ఎవరిని పిలవాలో.. ఎవరిని పిలవకూడదో అన్న విషయాన్నిముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా.. కేసీఆర్ విన్నట్లుగా కనిపిస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.