వైసీపీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో అఫిడవిట్లో భార్య గురించి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది.
2014 ఎన్నికల సందర్భంగా పెద్దిరెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ తప్పులతడకగా ఉందంటూ పుంగనూరు టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజు హైకోర్టును ఆశ్రయించారు. అఫిడవిట్ లో తన భార్యను ఒక చోట గృహిణిగా, మరోచోట కంపెనీ ఎండీగా చూపించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆస్తుల విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు.
తన ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను కూడా అందించారు. అయితే, ఈ పిటిషన్ ను గతంలో హైకోర్టు కొట్టివేసింది. దీంతో, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. పిటిషనర్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయని… పూర్తి స్థాయిలో విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది.