కాపుల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమం పక్కదారి పట్టిందంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఆయన చేపట్టిన ఉద్యమం వ్యక్తిగత విద్వేషాలను రెచ్చగొట్టే దారిలో వెళ్తుందని విమర్శించారు. మీరు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ లతో చేపట్టిన ఉద్యమాలన్నీ కాపుల కీడు చేసేలా ఉన్నాయని, మీరు వ్యవహరిస్తున్న తీరు కాపు లోకం మొత్తం అసహ్యించుకుంటుందని, ఇకనైనా జగన్ ముసుగు తొలగించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ, మృణాళిని కలిసి బహిరంగ లేఖ రాశారు.
కాపు సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేస్తూ… ప్రతిపక్ష పార్టీలకు లబ్ది చేకూర్చేలా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2004 కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపులను బీసీలలో చేరుస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాపుల సంక్షేమానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించిందని, అంతేకాదు కాపు రేజర్వేషన్ల కోసం మంజునాథ కమిషన్ వేసిందని అన్నారు. మీరు వైస్ జగన్మోహనరెడ్డి చేతిలో శిఖండిగా మారారని అభిప్రాయం యావత్తు కాపు సమాజంలో నెలకొందని వారు పేర్కొన్నారు.