తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు హూటాహుటిన బయలుదేరారు. సీఎం రమేష్ నివాసాలతోపాటు కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో రెండోరోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే కొన్ని కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిసక్క్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
సీఎం రమేశ్ కు చెందిన రిత్విక్ కంపెనీతో పాటు కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలోని ఆయన ఇంటిలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్ లోని ఇంట్లో ఉన్న డిజిటల్ లాకర్లు తెరిచేందుకు సీఎం రమేశ్ వేలిముద్రలు తప్పనిసరి కావడంతో ఐటీ అధికారులు ఈ మేరకు స్పందించారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రమేశ్ ను హైదరాబాద్ కు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ ఢిల్లీ నుంచి నగరానికి బయలుదేరారు. కాగా, సాయంత్రం 6 గంటలకల్లా రమేశ్ హైదరాబాద్ కు చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.సీఎం రమేశ్ సమర్పించిన రిటర్నులకు, ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.