ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తెలంగాణా – ఆంధ్ర గా విడిపోయిన తరవాత చాలా కాలం పాటు గవర్నర్ నరసింహన్ హెడ్ లైన్స్ లో కనిపించేవారు. తెలుగు దేశం నేతలు ఆయన్ని ఎప్పటికప్పుడు తక్కువ చేస్తూ కామెంట్లు చేసేవారు. ఓటుకి నోటు వ్యవహారం వెలుగు చూసిన సందర్భం లో గవర్నర్ వారికి అతిపెద్ద టార్గెట్ , గవర్నర్ ని ఒక సందర్భం లో రాజీనామా చెయ్యాలి అని కూడా వారు డిమాండ్ చేసిన రోజులు ఉన్నాయి.
తెలంగాణా కి గవర్నర్ ఇస్తున్న ప్రాధాన్యత ఏపీ కి ఆయన ఇవ్వడం లేదు పైగా భారీ గా పక్షపాతం చూపిస్తున్నారు అంటూ తెలుగు దేశం నేతలు ఆయన మీద కోప్పడే వారు. ఇలా ఆయన్ని దేశం నేతలు బాగానే ఆడిపోసుకున్నారు. అయితే, గత కొన్నాళ్లుగా గవర్నర్పై విమర్శలు తగ్గించారు దేశం నేతలు. తాజాగా, మళ్లీ గవర్నర్ను రంగంలోకి లాగేందుకు దేశం నేతలు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇదే టార్గెట్తో విమర్శలు చేయడం ఆరంభించారు దేశం ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు. గవర్నర్ ఒక ఉత్సవ విగ్రహంగా మాత్రం మారకూడదంటూ విమర్శలు స్టార్ట్ చేశారు గాలి ముద్దుకృష్ణమ.
సాగు నీటి ప్రాజెక్టుల విషయమై తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తుతూ ఉంటే గవర్నర్ చూస్తూ ఉండిపోతూ ప్రేక్షక పాత్ర పోషించడం తగదని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలిచి, సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత ఆయనకి ఉందని గాలి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఈ సమయంలో సరికాదని అన్నారు. విభజన చట్టం మొత్తాన్ని క్షుణ్ణంగా చదువుకున్న తరువాత ఎవరైనా మాట్లాడితే బాగుంటుందని గాలి అన్నారు. మొత్తానికి… ప్రాజెక్టుల విషయమై రెండు రాష్ట్రాల మధ్య చర్చించుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.
అయితే, ఆ చర్చలు జరిగేలా కృషి చేయాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల సర్కారులపైన ఉంటుంది. ఈ క్రమంలో గవర్నర్ను పెద్దమనిషిగా చూడాలి తప్పించి, ఆయనపై ఇలా విమర్శలు చేయడం కయ్యానికి కాలుదువ్వినట్టుగానే భావించాలి. ఏదేమైనా… ఈ ప్రాజెక్టుల వివాదాల్లోకి గవర్నర్ను లాక్కురావాలన్నట్టుగానే దేశం ధోరణి కనిపిస్తోంది. సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకోవాలీ అనుకునేవారు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయరు కదా!