పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. ఒక్కసారిగా 100 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు, కళ్లు తిరగడం,వాంతులు ,సొమ్మసిల్లి వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వీరిలో 20 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతానికి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఏలూరు ఘటనపై వైద్య నిపుణులు కూడా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ప్రజలు ఎందుకలా ఒక్కసారిగా అస్వస్థతకు గురవుతున్నారన్న విషయం మిస్టరీగా మారింది. అయితే తినే ఆహారంలో ఆర్గానో పాస్ఫేట్, లేదంటే ఫైలేత్రిం అనే విష పదార్థం కలిసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇప్పటికే ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఘటనపై మంత్రి నానిని సీఎం జగన్ స్వయంగా బాధితులను పలకరించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అయితే ఈ విష పదార్థం శరీరంలోకి వెళ్లడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని, ఫలితంగా మెదడు, వెన్నెముకతో పాటు శరీరంలోని నరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. పట్టణంలో నమోదైన కేసుల్లో దాదాపు 80 శాతం మందిలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
ఇక బాధితులకు నిర్వహించిన పరీక్షల్లో ఎటువంటి సమస్య లేకపోవడం వైద్యులను ఆశ్చర్యపరుస్తోంది. ఇదిలా ఉంటే.. సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ అనాలసిస్ కోసం పది మంది బాధితుల నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్లోని సీసీఎంబీకి పంపించారు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే ఈ పరీక్షల్లో తేలిపోతుంది. రిపోర్టు వచ్చేందుకు మాత్రం మరో 36 గంటలు వేచి చూడక తప్పదు.