నల్గొండ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం వద్దిపట్ల వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఏఎంఆర్ కాలువలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో సుమారు 30 మంది ఉన్నట్లు సమాచారం.
కూలీలు వద్దిపట్లలోని పడమటి తండా నుంచి పులిచర్లలోని మిరపచేనులో కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మృతదేహాలను వెలికితీశారు. కాల్వలో నీటి ఉధృతి అధికంగా ఉండడంతో కొంతమంది కూలీలు నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంలో మృతులు వీరే..
రమావత్ కేలీ (50), రమావత్ కంస్లి (50), రమావత్ భారతి (35), రమావత్ సునీత (30), జరుకుల ద్వాలి (30), రమావత్ లక్ష్మి, రమావత్ సోనా, రమావత్ జీజా, రమావత్ కంసాలి, బాణవత్ బేరీ, సురితగా గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. సుమారు 15 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
అయితే ఈ ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. విచారణకు ఆదేశాలు జారీ చేశారు.