ఆసియాలోనే అతిపెద్ద దేశాలైన భారత్, చైనా మధ్య కొద్ది నెలలుగా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు లద్దాఖ్ పర్వత ప్రాంతంలో మౌలిక వసతుల నిర్మాణం, వాటిని మెరుగుపరుచుకోవడం భారత్కు అత్యంత సున్నితమైన అంశం. అయితే కఠిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వీటి నిర్మాణాలను భారత్ ఆలస్యం చేసిన అనంతరం ఎట్టకేలకు యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్ల నిర్మాణం చేపడుతోంది.
చైనా సరిహద్దును తాకే కారాకోరం పాస్ సమీపంలోని దౌలత్ బేగ్ ఓల్దీ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేశారు అధికారులు. దీంతో పాటే లద్దాఖ్లోని సున్నితమైన ప్రాంతాలైన లేహ్, కార్గిల్లో మొత్తం 36 కొత్త హెలిప్యాడ్లను నిర్మించనున్నారు.లేహ్లో 19, కార్గిల్లో 17 హెలిప్యాడ్లను వచ్చే నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
కొత్తగా నిర్మిస్తోన్న హెలిప్యాడ్లు సాధారణమైనవి కావు. సామాన్య పౌరుల అవసరాలు తీర్చేందుకు, పర్యటకులను తీసుకెళ్లేందుకు, మెడికల్ ఎమర్జెన్సీకి, అత్యవసర పరిస్థితుల్లో సైనిక హెలికాప్టర్లు వినియోగించుకునేందుకు వీలుగా అన్ని సదుపాయాలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.