ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలెక్టరేట్ను ఆశ్రయించారు. వివిధ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ, పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్కు ఆయన ఒక విస్తృత అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు న్యాయం చేయాలంటూ అధికారులను వంశీ కోరారు.
బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో ఇప్పటికే పంపిణీకి సిద్ధంగా ఉన్న 2,400 ఇళ్ల పట్టాలను ఎలాంటి ఆలస్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని వంశీ కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు. ఈ ఇళ్ల పట్టాల కోసం పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. పట్టాలు అందితే అనేక కుటుంబాలకు స్థిర నివాస భద్రత లభిస్తుందని పేర్కొన్నారు.
అలాగే గన్నవరం విమానాశ్రయం విస్తరణలో భూములు కోల్పోయిన రైతుల సమస్యను కూడా ఆయన ప్రస్తావించారు. భూసేకరణ సమయంలో అమరావతిలో భూమి లేదా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఆ హామీలు నెరవేరలేదని వంశీ అన్నారు. భూములు కోల్పోయిన రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తక్షణమే అమరావతిలో ఇవ్వాల్సిన పట్టాలను అందించాలని కలెక్టర్ను కోరారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడమే ప్రజలపై ఉన్న బాధ్యతని వంశీ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలని ఆయన కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
