రాష్ట్రబడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు అసెంబ్లీ సామావేశాల్లో కరువుపై చర్చ జరిగింది. దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి డ్యాం పెంచారన్న సీఎం వైఎస్ జగన్… ఏపీకి రావాల్సిన కృష్ణా జలాలు బాగా తగ్గిపోయాయన్నారు. జగన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు పోవడాన్ని టీడీపీ నేతలు తప్పు పట్టడంతో జగన్ ఘాటుగా స్పందించారు.
‘కాళేశ్వరం అనే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లింది ఎప్పుడు అధ్యక్షా. ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యాక. జగన్ పోయినా, పోకపోయినా వాళ్లు బటన్ నొక్కేవాళ్లు. నీళ్లు పోయేవి. నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఐదేళ్లు ఈయన సీఎంగా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్లు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కడతాఉంటే ఈయన ఇక్కడ ఏం గాడిదలు కాశాడు అని అడుగుతున్నా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని టీడీపీ తీవ్రంగా తప్పుపట్టింది.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ‘టీడీపీ నేతలకు సామెతకు అర్థం తెలీదు. ఎలా మాట్లాడాలో అంతకన్నా తెలియదు’ అని దుయ్యబట్టారు.కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ఎందుకు వెళ్లారో చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఏపీ పట్ల సానుకూలంగా ఉండటం వల్లే… ఆ రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే మంచిదే అన్నారు. ఐతే… గాడిద అని జగన్ అనడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. తాను సామెత చెప్పానన్న జగన్… అలా చెప్పడంలో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు.
జగన్ కామెంట్స్పై బాబు దీటుగా స్పందించారు. తన రాజకీయ అనుభవమంత వయసు జగన్కు లేదన్నారు. గట్టిగా మాట్లాడితే తాము భయపడిపోతామనుకోవడం భ్రమేనని అన్నారు. కేసీఆర్ హిట్లర్ అని, కాళేశ్వరం వస్తే తెలంగాణ, ఆంధ్ర పాకిస్థాన్ మాదిరి అవుతుందని జగన్ గతంలో చెప్పారని మరో సారి గుర్తు చేశారు.