గత ఐదేళ్ల టర్మ్ లో ఏపీ అసెంబ్లీకి స్పీకర్ గా చేసిన వ్యక్తి ఒకరు టక్కున సీఎం పదవిని అధిష్టించారు. ఆయనే కిరణ్ కుమార్ రెడ్డి. రోశయ్య తప్పుకోవడం తో కిరణ్ కు కలిసొచ్చింది. స్పీకర్ గా ఉన్న గుర్తింపు ఆయనను సీఎంగా చేసింది. మరి ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న కోడెలకు కూడా అలాంటి అదృష్టమే కలిసి రానుందా? అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.
ఈయన కూడా ఏపీకి ముఖ్యమంత్రి అవుతాడా? అనే సందేహాలు నెలకొంటున్నాయి.
ఒకవేళ ఓటుకు నోటు వ్యవహారం తీవ్రస్థాయికి చేరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను గనుక ఏసీబీ అదుపులోకి తీసుకొంటే.. ఆయన పదవికీ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అదంతా జరగుతుందా? అంటే ఔనని చెప్పలేం కానీ, జరగదని మాత్రం చెప్పడానికి లేదు. ఈ పరిణామం లో ఏమైనా జరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంలో గట్టిగా వ్యవహరిస్తే చంద్రబాబు పదవికి ముప్పు రావడం అనేది పెద్ద కథే కాదు.. అని వారు అంటున్నారు.
మరి అదే జరిగితే ఏపీకి కొత్త ముఖ్యమంత్రి రావాల్సి ఉంటుంది. అప్పుడు అవకాశం కోడెల శివప్రసాదరావును తట్టవచ్చని సమాచారం. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా వారికి అవకాశం దక్కదని.. చంద్రబాబు సొంత సామాజికవర్గం.. విదేయుడు అయిన కోడెలకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. అలాగాకపోతే నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా రేసులో ఉన్నాడని టాక్ . బాబు ఏసీబీ కి పూర్తిగా దొరికిపోతే ముఖ్యమంత్రి పదవిని కోల్పోతే బాలయ్య పదవిని అధిష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో!