తెలంగాణా రాష్ట్రంలో రోజు రోజుకీ పరువు హత్యలు వెలుగు చేస్తున్నాయి. పరువు పేరుతో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ లో పరువుహత్య సంఘటన జరిగింది. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.దీంతో ఈ విషయం నచ్చని అమ్మాయి కుటుంబసభ్యులు కుమార్పై దాడి చేసి కొట్టిచంపారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
కుమార్ ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు కుమార్ ను బెదిరించారు. పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ సదరు యువతితో కుమార్ ప్రేమాయణం కొనసాగించాడు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి తాడికల్ శివారులో శవమై కనిపించాడు.
కుమార్ మరణంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. యువతి బంధువులే కుమార్ ను చంపేశారని, ఇది ముమ్మాటికీ పరువుహత్యేనని ఆరోపించారు. కుమార్ మరణంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల వాహనాన్ని కూడా గ్రామస్తులు ధ్వంసం చేశారు.మరోవైపు పోలీసులు మాట్లాడుతూ, ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని చెప్పారు.
ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ ను అతని మామా మారుతీరావు హత్య చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరువకముందే హైద్రాబాద్ గోకుల్ థియేటర్ సమీపంలో సందీప్, మాధవిలపై మాధవి తండ్రి మనోహరాచారి దాడి చేశాడు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది.