ఈనెల 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నారు. ఇక తన ప్రమాణ స్వీకార కార్యక్రమానకి రావాల్సిందిగా మాజీ సీఎం చంద్రబాబుకు జగన్ ఫోన్ చేసినట్లు సమాచారం.ఈ నెల 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా జగన్.. బాబును ఆహ్వానించారు.
ఇప్పటికే తన ప్రమాణస్వీకారానికి తెలంగాణా సీఎం కేసీఆర్తో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.కొద్దిసేపటి క్రితం చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసిన జగన్, మీరు వస్తే తనకు ఆనందమని చెప్పారు. ఓ సీనియర్ నేతగా, రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలు సీఎంగా పని చేసిన అనుభవమున్న తమ ఆశీస్సులు కావాలని జగన్ కోరినట్టు తెలుస్తోంది. దీనిపై బాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
2014లో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకాలేదు. వైసీపీ తరపున ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. పార్టీ తరుపునుంచి ఎవరూ కూడా హాజరు కాలేదు. ఇక చంద్రబాబు వస్తారా? లేదా? అన్న విషయమై టీడీపీ అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. ఇటీ వల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.