మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన సొంత జిల్లా కడపలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. అన్నకు తగ్గ తమ్ముడిగా ఏపీ రాజకీయలలో తనదైన ముద్ర వేశారు వైఎస్ వివేకానందరెడ్డి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీతో పాటు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వ్యవసాయశాఖ మంత్రిగా తన సేవలను రాష్ట్రానికి అందించాడు.
ఆయన 1989లో మొట్ట మొదటిసారి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత జరిగిన 1994 ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి య విజయం సాధించి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999, 2004లో కడప లోక్సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 లోక్సభ ఎన్నికల్లో లక్షా 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది వివేకానందరెడ్డి సంచలనం సృష్టించారు. రాజశేఖరరెడ్డి మరణంతరం కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం వైఎస్ జగన్తో విభేంచారు వైఎస్ వివేకానందరెడ్డి .
వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లినప్పుడు కూడా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. వదిన విజయమ్మపై కడప ఎంపీగా పోటీకి దిగి ఓటమి పాలైయ్యారు. ఆ తరువాత కొంతకాలానికే ఆయన జగన్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన కడపకు సంబంధించిన పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆయన నిన్న కూడా పార్టీ తరుపున ప్రచారం నిర్వహించారని పార్టీ నాయకులు తెలుపుతున్నారు.