ప్రధాని మోడీ… నల్ల ధనం అరికట్టడానికి పెద్ద నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొంచెం వెనుకబడ్డారు. పెద్ద నోట్లు రద్దు వల్ల సామాన్య ప్రజలు చిల్లర లేక బ్యాంకులు చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇలా ఉండగా మోడీ సర్కారు మరో షాకింగ్ నిర్ణయానికి సిద్దమవుతోంది.
అయితే అది కొందరికి శుభవార్తే! అదేంటంటే.. జీరో బ్యాలెన్స్ ఉన్న ప్రతి జన్ ధన్ ఖాతాలోనూ ప్రభుత్వమే రూ.10 వేలు జమ చేయాలనే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి.. అదే సమయంలో, చేతిలో డబ్బు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పేద ప్రజానీకానికీ ఇద్దరికీ మేలు చేసే చర్య ఇది అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రజలు తెరిచిన 25 కోట్ల జన్ ధన్ ఖాతాల్లో 5.8 కోట్ల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు.
ఆ ఖాతాలన్నిటిలో రూ.10 వేల చొప్పున వేయడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు.. రూ.58 వేల కోట్లు. వినడానికి అమ్మో అంత సొమ్మా అనిపించవచ్చుగానీ .. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వానికి రూ.3 లక్షల కోట్ల మేర లబ్ధిని పరిగణనలోకి తీసుకుంటే అది పెద్ద విషయమే కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ నిర్ణయం వల్ల కలిగే లాభాలను పేద రైతులు, ఇతర పేదలకు పంపిణీ చేయబోతున్నామనే సంకేతాలను ప్రభుత్వం ఈ చర్య వల్ల ఇవ్వగలుగుతుంది అని వారు విశ్లేషిస్తున్నారు.
Related