Monday, April 29, 2024
- Advertisement -

ఎంఐఎం పోటీతో వారిలో గుబులు!

- Advertisement -

ఆలిండియా మజ్లిస్‌-ఎ-ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ జాతీయ స్థాయిలో విస్తరిస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు పార్టీ బెంగాల్‌ ప్రతినిధులతో శనివారం ఆయన హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. బెంగాల్‌లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను వారితో చర్చించారు. బెంగాల్‌ నేతలతో ఫలవంతమైన చర్చలు జరిగాయని అసదుద్దీన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉన్నతికి చేపట్టాల్సిన భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించామని వెల్లడించారు. సమావేశానికి హాజరైన నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

బెంగాల్‌వైపుగా గాలిపటం
ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన మజ్లిస్‌ పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించాలన్న సంకల్పంతో ఒక్కో రాష్ట్రంలో అడుగు మోపుతుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో వేళ్లూనుకుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబర్చింది. ఐదు స్థానాల్లో విజయం సాధించింది. అదే ఉత్సాహంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి దిగుతోంది. బెంగాల్ అసెంబ్లీలో కనీసం 20 మంది తమ సభ్యులుండేలా ఓవైసీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టు మజ్లిస్‌ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీమాంచల్ ప్రాంతంతోపాటు.. 24 పరగణాలు, అసన్‌సోల్ వంటి ప్రాంతాల్లో మజ్లిస్‌ పార్టీకి బలమైన కేడర్‌ను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముస్లింల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఆ పార్టీ టార్గెట్ చేస్తోంది.

టీఎంసీ, బీజేపీకి వణుకు
బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పోటీకి దిగుతుండటంతో ఆయా పార్టీల్లో కలవరం మొదలైంది. ఎందుకంటే తమ ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి మజ్లిస్‌ ఏ విధంగా చేటు చేస్తుందోనని ఆ పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ దెబ్బతో మహాఘట్‌ బంధన్‌ అధికారానికి దూరమైంది.‌ ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంకులో యాదవులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. చాలా స్థానాల్లో మజ్లిస్‌ పార్టీ ఆర్జేడీ ఓట్లను చీల్చడంతో ఫలితాలు తారుమారయ్యాయి. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బెంగాల్లో రాళ్ల దాడి జరగడంతో అక్కడ రాజకీయం సెగలు కక్కుతోంది. టీఎంసీ వర్గాలే ఈ దాడికి పాల్పాడ్డాయని బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇరు పార్టీల విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాలు వేడెక్కాయి. మజ్లిస్‌ కూడా ఎన్నికల రణరంగంలోకి దిగుతుండటంతో రసవత్తర పోటీ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -