ఏపీసీఎం చంద్రబాబు నాయుడు జగన్, పవన్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలు టీడీపీ ఓటు వేస్తారని…అలాగే వైసీపీ, జనసేన పార్టీలను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. గుంటూరులో నారా హమారా, టీడీపీ హమారా పేరుతో జరిగిన మైనార్టీ సభలో బాబు పాల్గొన్నారు.
ఏపీ ప్రజలను మోసం చేసిన భాజాపా పంచన పవన్, జగన్ ఇద్దరూ చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏపై అవిశ్వాసం తీర్మానం పెడితే పవన్ పత్తా లేకుండా పోయారని ఎద్దేవ చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ అన్యాయం చేసిందని బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్తే మోసం చేశారన్నారు. దీంతో వారితో ఉండాల్సిన అవసరం లేదని ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పారు.
అవిశ్వామన్న వైసీపీ నేతలు ఎక్కడ దాక్కున్నారని మండి పడ్డారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో వీరోచితంగా పోరాడుతుంటే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి పిరికిపందలా పారిపోయారని సెటైర్స్ వేశారు. రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేసిందని, కేంద్రం ఆటలు ఇకపై సాగవని హెచ్చరించారు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేసే వరకు, ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు టీడీపీ పోరు ఆగదని మరోసారి స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆటలు ఇక్కడ సాగవు.. ఖబడ్దార్..జాగ్రత్తగా ఉండమని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా’ అని చంద్రబాబు భావోద్వేగంతో ప్రసంగించారు.