అవినీతిపై మంత్రి ఆది నారాయణరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు
అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధిలో అధమంగా ఉండి.. అవినీతిలో మాత్రం ప్రథమంగా ఉంది. ఈ విషయాన్ని ఎన్నో సర్వేలు, పలు సంస్థలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ధనవంతుడి సీఎం దేశంలో ఆయనే అని ఓ సంస్థ ప్రకటించింది. అంతగా ధనవంతుడిగా ఆయన ఖ్యాతి చెందగా ఆయన మాత్రం బీద అరుపులు అరుస్తుంటాడు. అయితే ఆయనతో పాటు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆరితేరిపోయారు. అయితే ఈ విషయమై ఓ మంత్రి ఇది వాస్తవం అని ధృవీకరించారు. ఏ పని చేసినా నీకు.. నాకు సగం అనే పద్ధతి పాటిస్తున్నట్లు బహిరంగ సభలో పేర్కొన్నారు. ఏ పని చేయాలన్నా ఇదే విధానం పాటించాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా అధికారులను కూర్చొబెట్టి చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి ఏవిధంగా పాల్పడుతున్నారో ఓ మంత్రి బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టిస్తోంది. అవినీతి చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు చెప్పారని మంత్రి ఆది నారాయణ రెడ్డి ప్రకటించారు. తాను చేసే అవినీతిలో టీడీపీ నాయకుడు మాజీమంత్రి రామసుబ్బారెడ్డికి కూడా అర్ధ రూపాయి భాగం ఉందని తెలిపారు. స్వయానా సీఎం చంద్రబాబు నాయుడే ఐఏఎస్ అధికారులను తమతో కూర్చోబెట్టి పంచాయతీ చెప్పించారని చెప్పారు.
రామసుబ్బారెడ్డి అడిగిన దాంట్లో మనకు సగం వస్తుంది, మనం అడిగినా రామసుబ్బారెడ్డికి సగం వస్తుంది అంటూ ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. ‘వాళ్లు దాంట్లో ఏది విమర్శించినా నేనైతే పట్టించుకోను, మీరెవరూ దయ చేసి విమర్శించమాకండి. మీకు కావాల్సిన పనులు నన్ను అడగండి. ఎస్ఎంఎస్ లు పెట్టండి. నీను మీ ఎమ్మెల్యేని, పక్కకు పోయినప్పుడే మంత్రిని’ అంటూ మంత్రి బహిరంగంగా చెప్పేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో ఇవి బయటకు వచ్చాయి. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది.