వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జవహర్. రోజా నోటి దురుసు తగ్గించుకోవాలని… రాష్ట్రంలో రోజా శూర్పణక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. రోజా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కష్టాలు పాలవడం మాములేనని, ఉన్న పార్టీని నాశనం చెయ్యడం రోజాకి అలవాటేనని మంత్రి విమర్శించారు.
వైసీపీ అధినేత జగన్ భార్య భారతిపై ఈడీ కేసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమన్న రోజా వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఈడీ కేసులకు, చంద్రబాబుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలకోసమే కేంద్రం నుండి బయటకు వచ్చామని అన్నారు. కేసుల కోసం జగన్ బీజేపీతో కుమక్కయ్యారని ఆరోపించారు. నాణ్యమైన మద్యం అందించడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పవన్ అంటే గాలి అని అర్థమని… గాలి మాటలను ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ను పట్టించుకునే తీరిక కూడా తమకు లేదని… పవన్ కంటే తానే గొప్ప నాయకుడినని అన్నారు.
