జగన్ చేస్తున్న పాదయాత్రలో వస్తున్న ప్రజా స్పందనను చూసి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు మారి పోతున్నాయి. టీడీపీలో సీనియర్ నాయకులు ఇప్పుడు వైసీపీవైపు చూస్తున్నారు. తాజాగా భూమానాగిరెడ్డి ఆప్తమిత్రుడు టీడీపీలో కీలక నేత ఏవి సుబ్బారెడ్డి త్వరలో వైసిపిలోకి చేరటం ఖాయమని తెలుస్తోంది.
ఏవి సుబ్బారెడ్డి వైసీపీలో చేరితే 2019 ఎన్నికల నాటికి కర్నూలు జిల్లావైసీపీలో అనేక మార్పులు,చేర్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే టీడీపీలో సుబ్బారెడ్డికి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక మంత్రిగా అఖిలప్రియ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిమధ్య విబేధాలు తారాస్థాయిలో ఉన్నసంగతి తెలిసిందే. వ్యాపారస్తుడు కూడా అయిన ఏవిని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మంత్రి ఇబ్బంది పెడుతున్నట్లు టిడిపిలోనే ప్రచారంలో ఉంది.
ఏవిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు శిల్పా బదర్స్ చొరవ తీసుకొని వైసీపీ నేతలతో మాట్లాడినట్లు సమాచారం. చక్రపాణి-ఏవి మంచి మిత్రలేకాకుండా వ్యాపార భాగస్తులు కూడానట. అయితే శ్రీశైలం టికెట్ను ఆశిస్తున్నారు. శ్రీశైలం నుండి పోటీ చేసేందుకు ఇప్పటికే చక్రపాణి రెడ్డి రెడీ అయ్యారు. హటాత్తుగా ఏవి ప్రతిపదానతో ఏం చేయాలో కీలక నేతలకు అర్దం కావటం లేదట.
ఏవికి శ్రీశైలం టిక్కెట్టు ఇస్తే చక్రపాణి రెడ్డి వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీ చేసేట్టు, శిల్పా మోహన్ రెడ్డికి ఎంఎల్సీ ఇచ్చి, మోహన్ రెడ్డి కొడుకును నంద్యాల ఎంపిగా పోటీ చేయించే ప్రతిపాదన కీలక నేతలు పరిశీలనలో ఉందట. ప్రతిపాదన కొలిక్కివస్తే ఆగస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డిని నంద్యాలకు కానీ శ్రీశైలంకు కానీ పిలిపించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అనుచరులతో సహా సుబ్బారెడ్డి వైసీపీ ఖండువా కప్పుకోనున్నారు.