కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు.
అఖిల మంత్రి అయినప్పటినుంచి ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ అయ్యింది. మంత్రి ఎవరినీ లెక్కచేయకపోవడంతో సీనియర్ నేతలంగా గుర్రుగా ఉన్నారు. అఖిల, ఏవీ మధ్య సయోధ్య కుదిర్చేందుకు బాబు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడంలేదు.
ఆళ్లగడ్డలో గురువారం జరిగిన ఏవీ హెల్ఫ్లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏవీ సుబ్బారెడ్డి …మంత్రి అఖిలప్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే ఇప్పుడు కర్నూలు జిల్లాలో సంచలనం రేపుతున్నాయి. భూమా నాగిరెడ్డి బతికుంటే నన్ను గుంటనక్కలు అని సంబోధించినందుకు అఖిలప్రియ చెంపలు వాయించి ఇంట్లో కూర్చోమని చెప్పేవాడన్నారు. మా ఇద్దరి మధ్య అనుబంధం అలాంటిదన్నారు.
భూమా నాగిరెడ్డి హీరో అయితే నేను డైరెక్టర్ను. సినిమాలో హీరోనే కనబడతాడు..డైరెక్టర్ కనిపించడు…నేను కూడా అంతే. భూమా వర్థంతి సభలో నేను లేకుంటే.. ఆయన ఆత్మ శాంతిస్తుందా?. భూమా నాగిరెడ్డి కోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో నాకు తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఆళ్లగడ్డలో పోటీ చేస్తా. ఆళ్లగడ్డలో ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 7093382333’ అని తెలిపారు
ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అందుకే తన బలాన్ని అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకొని వెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. మరి అఖిలప్రియ పరిస్థితి ఏంటనేది అందరిలో మొదలైన సమస్య. అఖిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.